ఆకర్షణీయమైన పోస్టాఫీస్ డిపాజిట్ల గురించి ఈ విషయాలు తెలుసా?
ఇప్పుడు మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అయితే వాటిల్లో రాబడి గ్యారెంటీనా, ఇంతకూ మనం పెట్టుబడి పెట్టిన మొత్తానికైనా 100 శాతం గ్యారెంటీ ఉందా అంటే చెప్పడం కష్టమే. అధిక రాబడి ఇస్తామని చెప్పిన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కూడా డిబెంచర్లు, బాండ్ల విషయంలో చేతులెత్తేస్తున్న తురణమిది. మరి ఈ సమయంలో ఏం చేయాలి. మన పెట్టుబడికి వంద శాతం గ్యారెంటీతో మెరుగైన రాబడి ఇచ్చే సాధనం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వచ్చే సమాధానం పోస్టాఫీస్ ఫిక్సెడ్ డిపాజిట్లు. ఆ.. ఇంకా పోస్టాఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారండీ.. ఆన్ లైన్ ఫెసిలిటీ కూడా ఉండదు అని నిట్టూర్చే ముందు ఈ పాయింట్లు తెలుసుకోండి.
పోస్టాఫీస్ సేవలు
పోస్టాఫీసులు వివిధ సేవింగ్స్ స్కీములు, వివిధ కాలపరిమితులకు ఆఫర్ చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపధ్యంలో పోస్టాఫీస్ టైం డిపాజిట్ (ఫిక్సెడ్ డిపాజిట్) గురించి తెలుసుకుందాం. వీటిని టర్మ్ డిపాజిట్స్ అని కూడా పిలుస్తారు. ప్రభుత్వమే దీనికి బలం. కేంద్ర ప్రభుత్వం మన డబ్బుకు పూర్తిగా హామీగా ఉంటుంది. అందుకే డబ్బు వంద శాతం... అవును వంద శాతం పక్కాగా సేఫ్. అయితే వీటిపై వడ్డీని కేంద్రం ప్రతీ మూడు నెలలకు ఓ సారి సమీక్షిస్తూ ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లు, పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం వంటివి కూడా పోస్టాఫీసులు ఆఫర్ చేస్తున్న సేవలు.
ఏంటీ టైం డిపాజిట్ స్పెషాలిటీ
ఎవరైనా వీటిని చెక్కు, లేదా క్యాష్ ఇచ్చి ఖాతాను తెరవొచ్చు. అయితే పోస్ట్ డేటెడ్ చెక్స్ కాకుండా.. అదే రోజున చెల్లుబాటయ్యే తేదీతో చెక్స్ మాత్రమే తీసుకుంటారు.
ఈ జూలై 1వ తేదీన ఈ వడ్డీ రేట్లను సమీక్షించారు. దాని ప్రకారం ఏడాది, రెండు, మూడేళ్ల పరిమితి ఉండే డిపాజిట్లకు 6.9 శాతం వడ్డీని నిర్ణయించారు. అదే ఐదేళ్ల పరిమితి ఉండే ఫిక్సెడ్ డిపాజిట్లకు పోస్టాఫీస్ 7.7 శాతం వడ్డీని ఇస్తోంది. అంటే ఈ లెక్కన మీ డబ్బు రెట్టింపు కావాలంటే 9 ఏళ్ల మూడు నెలలు పోస్టాఫీసులో ఉంచాలి.
ఇందులో ఎఫ్.డి. తెరవడానికి కనీస మొత్తం రూ.200 ఉండాలి. గరిష్టంగా ఎంతమొత్తమైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఎలాంటి పరిమితీ లేదు.
ఐదేళ్లకు పెట్టుబడిపెట్టిన ఎఫ్. డి.లపై ఆదాయపు పన్ను శాఖ ప్రోత్సాహకం సెక్షన్ 80సి వర్తిస్తుంది. అంటే మీరు ఈ సెక్షన్ కింద క్లైం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తంపై వచ్చే వడ్డీపై మాత్రం ఎలాంటి మినహాయింపు లేదు. అంటే ఈ వడ్డీని కూడా ఆదాయంగా పరిణగిస్తారు.
బ్యాంకు ఖాతాలో అసలు, వడ్డీ
ఈ బాండ్స్ మెచ్యూరిటీ ముగిసిన వెంటనే నేరుగా మీ బ్యాంకు ఖాతాలో అసలు, వడ్డీ జమైపోతుంది.
ఈ ఖాతాల్లో పెట్టే పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వ పూచీ ఉంటుంది. ఈ వడ్డీని కూడా కేంద్రమే ఇస్తుంది కాబట్టి అసలు, వడ్డీకి ఎలాంటి ఆందోళనా లేదు.
ఎవరు ఎన్ని ఫిక్సెడ్ డిపాజిట్లైనా చేయొచ్చు. ఎన్ని ఖాతాలైనా తెరవొచ్చు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ ఫిక్సెడ్ డిపాజిట్లను బదలాయించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అంటే మీరు ప్రాంతం మారినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరున్న చోటికే వీటిని మార్చుకోవచ్చు.
చదివారుగా.. మీ అసలుపై పూర్తి భరోసా ఉండి, వడ్డీ కాస్త తక్కువ వచ్చినా ఫర్వాలేదు అనుకునే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్.