సీనియర్ సిటిజన్లకు భరోసా ఈ పథకం
ఆరు పదుల వయసు దాటిందంటే మీరు సీనియర్ సిటీజన్లుగా మారినట్టే. ఈ వయసు రాగానే ఒంట్లో శ్రమ శక్తి తగ్గిపోతుంది. భాద్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆదాయం ఉండదు కానీ ఖర్చులు మాత్రం అదేవిధంగా ఉంటాయి. అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఆదాయం ఇవ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా కల్పించేదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం (ఎస్ సిఎస్ఎస్) . ఈ పథకంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎంత వడ్డీ రేటు వస్తుంది, ఎప్పుడు సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు వగైరా విషయాలు తెలుసుకుందాం....
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు
60 ఏళ్ళు దాటిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది దీర్ఘకాలిక పొదుపునకు ఒక మంచి అవకాశంలాంటిది. ఈ స్కీములో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఖాతా తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు.
వీటిలో పెట్టుబడితో మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు..
అర్హతలు
- 60 ఏళ్ళు అంతకు మించిన వయసున్న వారు ఎస్ సిఎస్ఎస్
లో పెట్టుబడి పెట్టవచ్చు. భార్య/భర్త తో కలిసి జాయింట్ గా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు.
- దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ ఖాతాను తెరవవచ్చు.
- స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన వారు లేదా 55-60 మధ్య వయసులో పదవీ విరమణ చేసినవారు తమ రిటైర్మెంట్ ప్రయోజనాలను అందుకున్న తర్వాతి నెల రోజుల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.
- ఒకరికన్నా ఎక్కువ మంది నామినీలను పెట్టుకోవచ్చు.
- ప్రవాస భారతీయులు ఈ ఖాతాను తెరవరాదు.
- హిందూ అవిభాజ్య కుటుంబాలు కూడా ఈ ఖాతాకు అనర్హులు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..
వ్యక్తులు గరిష్టంగా రూ.15 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్మెంట్ సమయంలో పొందిన సొమ్ము కన్నా పెట్టుబడి సొమ్ము అధికంగా ఉండకుండా చూసుకోవాలి. ఈ పథకంలో పెట్టుబడిని నగదు (రూ, లక్షకన్నా తక్కువ ఉంటే), చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా జమచేయవచ్చు.
రూ. 15 లక్షలు దాటకుండా ఒకటికి మించి ఖాతాలను తెరవవచ్చు.
ప్రయోజనాలు
- ఎస్ సిఎస్ఎస్ అనేది భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన పథకం ఇది. కాబట్టి పెట్టుబడులకు, రాబడులకు భరోసా ఉంటుంది.
- ఈ ఖాతాను అధీకృత బ్యాంకు శాఖలు లేదా పోస్టాఫీసుల్లో తెరవవచ్చు. ఈ ఖాతాను సులభంగా ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేసుకోవచ్చు.
- ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే ఎస్ సిఎస్ఎస్ పెట్టుబడులపై ఎక్కువ రాబడి వస్తుంది.
- ఈ ఖాతాపై వడ్డీ రేటు మారవచ్చు. 2012-13 సంవత్సరంలో 9.3 శాతం వడ్డీ రేటు లభించింది. తర్వాత కాస్త తగ్గింది.
- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1. 5 లక్షల వరకు మినహాయింపును పొందవచ్చు.
- ఈ పథక కాలపరిమితి ఐదేళ్లు. ఐదేళ్ల తర్వాత అదనంగా మూడేళ్లు పెంచుకోవచ్చు.
- ఖాతా తెరిచిన ఏడాది తర్వాత సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాను రెండేళ్లలోపు క్లోజ్ చేయాలనుకుంటే ముందస్తు విత్ డ్రాయల్ కింద డిపాజిట్లో 1.5 శాతం చార్జీలను వసూలు చేస్తారు. రెండేళ్ల తర్వాత అయితే డిపాజిట్ మొత్తంలో ఒక శాతం చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది.
- ఒకవేళ డిపాజిటర్ మరణించి ఖాతాను ముందుగానే క్లోజ్ చేయాల్సి వస్తే ఎలాంటి చార్జీలు ఉండవు.