పొదుపుదారులకు నిరాశే: పీపీఎఫ్ వడ్డీ రేట్లలో కోత..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును పావుశాతం తగ్గించింది. రెపోరేటు 0.25 శాతం కోతతో హోం, వాహన రుణాలు తీసుకున్న వారికి మరోసారి వడ్డీ రేటు తగ్గేందుకు మార్గం సుగమమైంది.
ఈ క్రమంలోనే చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లాంటి పథకాల వడ్డీరేట్లు జూలై-సెప్టెంబర్ కాలంలో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశాలున్నాయని రీసెర్చ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునేవారు చింతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీపీఎఫ్ వడ్డీరేట్లు 7.85 నుంచి 7.9 శాతం మధ్య ఉండనున్నట్టు రీసెర్చ్ ఏజెన్సీ తెలిపింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేవారి వడ్డీరేట్లలో ప్రతి మూడు నెలలకోసారి మార్పులు జరుగుతాయి. ప్రభుత్వ సెక్యురిటీలు, బాండ్లకు అనుగుణంగా వీటిని మూడు నెలలకొకసారి సమీక్షిస్తుంటారు.
చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లపై ఏప్రిల్ త్రైమాసికంలో ప్రభుత్వం కోత విధించింది. దీని ఫలితంగా జూన్ 30-ఏప్రిల్ 1 మధ్యకాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు 8.7 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గాయి. మరోవైపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై వడ్డీరేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గాయి.
చిన్న పిల్లల సుకన్య సమృద్ధి ఖాతాలపై వడ్డీరేట్లు 9.2 నుంచి 8.6 శాతానికి దిగివచ్చాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెంచేందుకే ఆర్బీఐ ఈ లిక్విడిటీ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.