జొమాటో గుడ్న్యూస్, టేక్-అవే సేవలపై జీరో కమిషన్: 200% పెరిగిన ఆర్డర్లు
ఫుడ్ టెక్ యూనికార్న్ జొమాటో కీలక ప్రకటన చేసింది. రెస్టారెంట్ భాగస్వాముల వద్ద లభించే టేక్-అవే సేవలను సున్నా కమిషన్కే అందించనున్నట్లు ఈ ఫుడ్ డెలివరీ సంస్థ ప్రకటించింది. హోటల్ పరిశ్రమ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇది తోడ్పడుతుందని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుండి ఫుడ్ డెలివరీ వ్యాపారం బలంగా పుంజుకుంటోందని, అయితే వృద్ధి ఒకే విధంగా లేదని పేర్కొంది. తమ ఫుడ్ డెలివరీ విభాగం కరోనా ముందుస్థాయితో పోలిస్తే స్థూల వ్యాపార వ్యాల్యూ 110 శాతంగా ఉందని వెల్లడించింది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది: మూడీస్ తర్వాత గోల్డ్మన్ శాక్స్ అంచనా
ఫుడ్ డెలివరీ వల్ల ఒక్క కరోనా కేసు లేదు
మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నాటి నుండి 13 కోట్లకు పైగా ఆర్డర్లు డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. ఆహారం లేదా ప్యాకింగ్ ద్వారా ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. గతకొద్ది నెలలుగా టేక్-అవేలు 200 శాతం వృద్ధిని నమోద చేసినట్లు తెలిపింది. ప్రారంభంలో డెలివరీ ఫుడ్ తీసుకోవడానికి కస్టమర్లు భయపడ్డారు. కానీ ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది.
హోటల్స్కు శుభవార్త
కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో హోటల్ ఇండస్ట్రీ ఉంది. హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. అన్-లాక్ నేపథ్యంలో క్రమంగా హోటల్ రంగం పుంజుకుంటోంది. ఈ సమయంలో హోటల్స్కు జొమాటో గుడ్ న్యూస్ చెప్పింది. తమ రెస్టారెంట్ పార్ట్నర్స్కు టేక్ అవే సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపింది.
టేక్-అవే సేవలకు ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని తెలిపింది. ఈ మేరకు జొమాటో దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. రెస్టారెంట్స్కు అండగా ఉండేందుకు తాము టేక్-అవేకు వసూలు చేయమని, ఇప్పటికే టేక్-అవే వ్యాల్యూమ్ 200 శాతం పెరిగిందని తెలిపారు. తాము టేక్-అవే, పికప్ సేవలను గతంలో కంటే పెంచుతున్నామని, కమిషన్ రహిత సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. పేమెంట్ గేట్ వే ఛార్జీలను కూడా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా జాగ్రత్తలు
తాము ప్రతి వారం వేలాది మందికి సేవలు అందిస్తున్నామని, 55,000కు పైగా రెస్టారెంట్లు జత కట్టాయని దీపిందర్ గోయల్ తెలిపారు. డెలివరీ సమయంలో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
కాగా, జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరియా లేక టేక్-అవేనా అని యాప్లో అడుగుతుంది. డెలివరీ అయితే ఇంటికి పార్సిల్ వస్తుంది. టేక్-అవే సెలక్ట్ చేసుకుంటే హోటల్ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలి. దీనికి డెలివరీ ఛార్జీలు లేవు.