రంగు రాళ్లు కొంటున్న సంపన్న యువకులు.... ఎందుకో తెలుసా?
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెత ఎల్లప్పుడూ నిజమేనని నిరూపిస్తుంది. ట్రెండ్స్ ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి. కానీ కొత్త ట్రెండ్స్ అనేవి పాత వాటికి మరింతగా సొబగులు అద్దటం వల్లనే ఆదరణ పొందుతున్నాయి. ఫాషన్ ఎక్కడ మొదలైనా... అది ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి గానీ పోదు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.... ఒకప్పుడు రాజుల కాలంలో వారి ఆభరణాలలో వజ్ర, వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు అధికంగా వాడే వారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో అయితే ఏకంగా రత్నాలు రాసులుగా పోసి మరీ విక్రయించే వారట. అంటే, అప్పట్లో వాటికి అంత డిమాండ్ ఉండేది. కాల క్రమంలో ఆభరణాలలో బంగారంతో పాటు అధికంగా వజ్రాలు వాడటం మొదలైంది. అక్కడక్కడా ఇతరత్రా వాడినా పెద్ద మొత్తంలో లేదు. కానీ గత పదేళ్ల కాలంలో భారత దేశంలో రంగు రాళ్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సంపన్నులు, యువత వీటిని అధికంగా ఉపయోగించటం కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా....
150% పెరిగిన రంగురాళ్ల దిగుమతులు...
మన దేశంలో రంగు రాళ్లకు అంతకంతకూ డిమాండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా వీటి దిగుమతులు పెరుగుతున్నాయి. జెమ్ అండ్ జ్యువలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ... 2008-09 లో రంగురాళ్ల దిగుమతులు 106 మిలియన్ డాలర్లు (సుమారు రూ 742 కోట్లు) ఉండగా... 2017-18 నాటికి వాటి విలువ ఏకంగా రూ 906 మిలియన్ డాలర్ల కు (దాదాపు రూ 6,342 కోట్లు) పెరిగిపోయింది. అంటే, మన వాళ్ళు రంగురాళ్ల పై ఈమేరకు మోజు పెంచుకుంటున్నారో స్పష్టమవుతోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది (2019) ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు రంగురాళ్ల దిగుమతులు ఏకంగా 150% పెరగటం ట్రెండ్ ను సూచిస్తోంది. అదే సమయంలో వజ్రాల దిగుమతులు 23% పడిపోయాయి.
అందుకే అలా...
ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన రంగు రాళ్ల ను సెలెబ్రిటీలు ధరిస్తున్నారు. బ్రిటిష్ రాజ కుటుంబం కూడా వీటిని అధికంగా వాడుతున్నట్లు తెలిసింది. అదే ట్రెండ్ కు అనుగుణంగా భారత్ లోనూ యువకులు, సంపన్నులు రంగు రాళ్లను ఇష్ట పడుతున్నారు. ఆభరణాల్లో వీటిని పొదిగించి వాడుతున్నారు. మన వారసత్వ పరంగా చూసినా రత్నాలు, కెంపులు, పచ్చలు, నీలం వంటి రంగు రాళ్లకు డిమాండ్ అధికంగా ఉండేది. అదే ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. రంగు రాళ్లను ఉంగరాల్లో, ఆభరణాలలో ఎక్కువగా వాడుతున్నారు. లుక్ పరంగా కూడా ఇవి అందంగా ఉండటంతో ఆదరణ పెరుగుతోంది. పైగా, బంగారం, వెండి, వజ్రాలు అందరి దగ్గరా ఉంటాయి. అప్పుడు వెరైటీ ఏముంటుంది. అందుకే, ఎవరి దగ్గర లేని, సరికొత్త లుక్, సరికొత్త జెమ్ స్టోన్ తో చేసిన ఆభరణాలు ధరిస్తేనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తామన్న ఆలోచన ధోరణి అధికమైంది. దీంతో అటు సంపన్నులు, ఇటు యువత వీటిని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇక్కడి నుంచి దిగుమతులు...
సాధారణంగా మన వాళ్ళు ముడి రంగు రాళ్లను దిగుమతి చేసుకొని ఇక్కడ పోలిష్ చేస్తారు. రూబీ లను మయాన్మార్, మొజాంబిక్ దేశాల నుంచి దిగుమతి చేసుకొంటాము. కొలంబియా, బ్రెజిల్, జాంబియా ల నుంచి ఎమెరాల్డ్ స్టోన్స్ దిగుమతి అవుతాయి. బ్లూ సఫైర్ లను శ్రీ లంక, అమెరికా, మాడగాస్కర్, టాంజానియా, ఆస్ట్రేలియా, చైనా ల నుంచి దిగుమతి చేసుకొంటారు. వీటితో పాటు మల్టీ కలర్ జెమ్ స్టోన్స్ కూడా లభిస్తున్నాయి. గ్రీన్-పింక్ వంటి కాంబినేషన్కు క్రేజ్ అధికంగా ఉంది. సౌత్ ఇండియా లో రూబీ లు అధికంగా వాడుతున్నారు.
రూ 30,000 - రూ 40,000 లకు లభ్యం...
వజ్రాల అంత ఖరీదు కాకపోయినా... రంగు రాళ్లు పొదిగిన ఆభరణాల ధరలు కూడా ఓ స్థాయిలో ఉంటున్నాయి. మధ్యస్థంగా చూస్తే రూ 30,000 నుంచి రూ 40,000 ధరల్లో అధిక మోడల్స్ లభ్యమవుతున్నాయని జెవెల్లెర్స్ చెబుతున్నారు. కొన్నిరకాల మోడల్స్ ధరలు లక్షల్లో కూడా ఉంటాయని, వాటి ఖచ్చితమైన ధరలు కేవలం వినియోగదారులకు మాత్రమే వెల్లడిస్తామని చెప్పారు. కాగా, రంగు రాళ్ల అమ్మకాల ట్రెండ్ బ్రాండెడ్ జ్యువలరీ షోరూం లకు కూడా పాకింది. పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూం లలో కూడా జెమ్ స్టోన్స్ లభిస్తున్నాయి. వాటి మొత్తం అమ్మకాల్లో 10% నుంచి 15% వరకు ఖరీదైన జెమ్ స్టోన్స్ ఉంటున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. జోతిష్యులు, నుమెరోలాజిస్ట్ లు కూడా రంగు రాళ్లను వాడమని సూచిస్తుంటారు. ఇది కూడా వీటి వినియోగ సరళి పెరిగేందుకు కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.