Yes Bank crisis: కస్టమర్లకు యస్ బ్యాంకు ఊరట, అర్ధరాత్రి ట్వీట్, ATM ఇబ్బందులు
కస్టమర్లకు యస్ బ్యాంకు ఊరటనిచ్చే ట్వీట్ చేసింది. యస్ బ్యాంకు డెబిట్ కార్డ్స్ను ఉపయోగించే ఏ ఏటీఎం నుండి అయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని పేర్కొంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. ఓపిక వహించినందుకు కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ట్వీట్లో ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్ను ట్యాగ్ చేసింది.
73% పెరగనున్న భారత కుబేరులు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలుసా?
కస్టమర్ల ఇబ్బందులు
యస్ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పని చేయడం లేదని, ఏటీఎంలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చెక్కు ద్వారా డబ్బులు ఉపసంహరించుకుంటామని కస్టమర్లు అంటున్నారు. ఆర్బీఐ మారటోరియం అనంతరం యస్ బ్యాంకు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకు ట్వీట్ చేసింది.
బ్యాంకు, ఏటీఎం వద్ద బారులు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు కస్టమర్లు నెలకు నగదు విత్ డ్రా పరిమితిని రూ.50,000కు చేసింది. దీంతో కస్టమర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు నాలుగు రోజులుగా ఆ బ్యాంకు శాఖలు, ఏటీఎంల వద్ద భారీ సంఖ్యలో బారులుతీరారు. గురువారం సాయంత్రం నుంచి యస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ పని చేయడం లేదని, నగదు ఉపసంహరణకు ప్రయత్నిస్తుంటే కనెక్షన్ ఎర్రర్ అని సమాధానం వస్తోందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెయిట్ చేయాలని..
యస్ బ్యాంకులో తమ ఖాతాలు మూసివేస్తామని, కానీ నెట్ బ్యాంకింగ్ పని చేయడం లేదని, దీంతో ఆన్లైన్లో ఎలా చేయాలో తెలియడం లేదని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ కోసం కాస్త వెయిట్ చేయాలని యస్ బ్యాంకు కూడా మూడు రోజుల క్రితం సూచించింది. బ్యాంకింగ్ టోల్ ఫ్రీ నంబర్ 18001200 నుంచి 18002000కు మార్చింది.
చెక్స్ ద్వారా రూ.50,000
కస్టమర్లు ఏటీఎంల వద్ద బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయి. ఎక్కువ మంది చెక్స్ ద్వారా రూ.50,000 విత్ డ్రా చేసుకుంటున్నారు. కొంతమందికి క్రిడెట్/డెబిట్ కార్డులు పని చేయలేదు. కానీ వీటిని ఇప్పుడు ఉపయోగించవచ్చునని బ్యాంకు ట్వీట్ చేసింది.
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్
యస్ బ్యాంకు ఫౌండర్ రానా కపూర్ను ఈడీ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఆయన ఇంటిలో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం వెస్ట్ ముంబైలోని సముద్ర మహల్ ఇంటిపై దాడులు నిర్వహించింది. రానాను 20 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం PMLA నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రానా కపూర్ ముగ్గురు కూతుళ్లు, ఇళ్ళలో కూడా శనివారం శోధించారు.