వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగితే కాపురాలు కూలుతాయ్
వర్క్ ఫ్రమ్ హోమ్ పైన బిజినెస్ టైకూన్ హిలేరియస్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ థీమ్ దీర్ఘకాలం కొనసాగితే తమ కాపురాలు కూలిపోతాయని వివిధ సంస్థల ఉద్యోగుల జీవిత భాగస్వాములు ప్రత్యేకించి భార్యలు ఆందోళన చెందుతున్నారని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షగోయెంకాను ఉద్దేశించి చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పైన హర్షగోయెంక తనకు వచ్చిన లెటర్ను ట్వీట్ చేశారు. ఇది నెటిజన్లను ఆకర్షిస్తోంది.
హర్షగోయెంకా కంపెనీలో పని చేసే ఉద్యోగి భార్య ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె 'వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగే మరికొంత కాలం కొనసాగితే మా వైవాహిక జీవితానికి తెరపడుతుంది' అని పేర్కొన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తీ పలకాలని సూచించారు. తమ మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా దీనిపై ఆమెకు ఎలా సమాధానం ఇవ్వాలో అర్థం కావడం లేదని హర్ష గోయెంకా ట్వీట్లో పేర్కొన్నారు. తన భర్త రోజుకు పదిసార్లు కాఫీ తాగుతారని, మరో గదిలో పని చేస్తున్నా, నిత్యం ఆహారం కోసం పదేపదే అడుగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తూనే నిద్రపోతారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తన మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకోవాల్సి ఉందన్నారు. హర్షగోయంకా చేసిన ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఆఫీస్కు విప్రో ఉద్యోగులు
కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండటం సహా వివిధ కారణాలతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్లకు పిలిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం విప్రో తన కంపెనీ ఉద్యోగులను సోమవారం నుండి ఆఫీస్కు రావాలని ఆదేశించింది. సెకండ్ డోస్ పూర్తయిన వారిని విధులకు అనుమతిస్తుంది. హైబ్రిడ్ మోడల్ వర్క్ విధానంలో ప్రస్తుతానికి వారానికి 2 రోజులు ఆఫీస్ నుండి పని చేయాలని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఆదివారం ట్వీట్ చేశారు.
పద్దెనిమిది నెలల తర్వాత తమ ఉద్యోగులు సోమవారం నుండి వారానికి 2 రోజులపాటు కార్యాలయానికి వస్తున్నారని, సెకండ్ డోస్ వ్యాక్సీన్ అయిన వారు సురక్షితంగా వచ్చి వెళ్లేలా, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని రిషద్ తెలిపారు. ఆఫీస్, ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్స్ పైన రూపొందించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. జులై నాటికి విప్రో ఉద్యోగుల్లో దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సంస్థలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి పలు కంపెనీలు ఉద్యోగులను కార్యాలయానికి రప్పించే ప్రణాళికలతో ఉన్నాయి. అయితే ఐటీ రంగంలో వచ్చే అయిదేళ్ల కాలంలో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశాలు కూాడా లేకపోలేదు.