ఒమిక్రాన్ దెబ్బ, వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించిన ఐటీ కంపెనీలు
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో వివిధ రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ను పొడిగిస్తున్నాయి. 2021 చివరలో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు జనవరి నుండి రిటర్న్ టు ఆఫీస్(ఉద్యోగులని తిరిగి కార్యాలయాలకు రప్పించడం) ను చేపట్టాయి. అయితే అంతలోనే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 317,627,277 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్లో మొత్తం కరోనా కేసులు 36,317,927కు చేరుకున్నాయి. దేశంలో ప్రతిరోజు కొత్తగా 2.47 లక్షల కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెల నుండి ఇదే గరిష్టం కావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పొడిగిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు అమెజాన్ నుండి మొదలు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్, దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వరకు అన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తున్నాయి. టీసీఎస్ జనవరి నుండి 50 శాతం నుండి 70 శాతం వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండాలని భావించింది. కానీ ఒమిక్రాన్ ఈ నిర్ణయంపై ప్రభావం చూపింది. ఈ కంపెనీలకు చెందిన దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. మరికొద్దిరోజులు ఇదే కొనసాగనుంది.