ATM Withdrawal rules: డబ్బులు తీస్తే.. అదనపు భారం
వచ్చే జనవరి నుండి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్స్కు మించి ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. బ్యాంకులు ప్రస్తుతం ఒక్కో అదనపు ట్రాన్సాక్షన్ పైన రూ.20 ఛార్జ్ చేస్తున్నాయి. ఇది రూ.21కి పెరగనుంది. ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, నిర్వహణకు వ్యయాలు పెరిగాయని, ఇంటర్చేంజ్ ఫీజు కూడా పెరిగిందని, దీంతో సాధారణ ఖర్చులకు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతించినట్లు ఆర్బీఐ తెలిపింది.
పెంచిన ఛార్జీల ప్రకారం 2022 జనవరి 1వ తేదీ నుండి నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్స్ ముగిశాక చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన కస్టమర్లు రూ.21 చెల్లించవలసి ఉంటుంది. సొంత బ్యాంక్ ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత లావాదావీలు(ఆర్థిక, ఆర్థికేతర కలిపి) నిర్వహించుకోవడాన్ని కొనసాగించడం కస్టమర్లకు ఊరట కలిగించే అంశం. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంక్ ఏటీఎం నుండి మూడు, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ను అనుమతిస్తారు.
ఈ ఏడాది ఆగస్ట్ 1వ తేదీ నుండి అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన ఇంటర్చేంజ్ ఫీజు రూ.15 నుండి రూ.17కు, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైన రూ.5 నుండి రూ.6కు పెంచుకునే అవకాశం కల్పించింది. ఏటీఎం ట్రాన్సాక్షన్ పైన ప్రస్తుత ఛార్జీలు 2014 నుండి, ఇంటర్చేంజ్ ఫీజు వసూలు 2012 ఆగస్ట్ నుండి అమలవుతున్నాయి. అప్పటి నుండి ఛార్జీలు పెంచలేదు.