ఒక్కరోజులో రూ.1.42 లక్షల కోట్ల నష్టం: మార్కెట్ నష్టానికి కారణాలేమిటి?
ఈ వారం చివరలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న (గురువారం) దాదాపు 500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నేడు ఉదయం సెషన్లో మరో 200 పాయింట్ల మేర పతనమైంది. కరోనా మహమ్మారి కొత్త కేసులు మొదలు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ భారీ నష్టాలకు కారణం. ఏడాదిన్నర క్రితం కరోనా మహమ్మారితో ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. సెకండ్ వేవ్తో మరోసారి ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. సెన్సెక్స్ ఇటీవల 53,000 మార్కును క్రాస్ చేసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ రెండు రోజులుగా క్షీణిస్తోంది.
అందుకే మార్కెట్లు డౌన్
కరోనా కొత్త కేసులు మళ్లీ భయపెట్టాయి. అలాగే, పలు దేశాల్లో కోవిడ్ 19 డెల్టా వేరియంట్ కేసులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. అలాగే వడ్డీ రేట్ల పెంపు పైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యలు కూడా కలవరపెట్టాయి. దీంతో సెన్సెక్స్ నిన్న ఏకంగా 485 పాయింట్లు నష్టపోయింది. నేడు కూడా 200 పాయింట్ల నష్టంతో ఉంది. సెన్సెక్స్ 30 షేర్లలో 24 షేర్లు నష్టపోవడం గమనార్హం. టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, HCL టెక్ మాత్రమే నిన్న లాభపడ్డాయి.
కలవరం కానీ...
స్టాక్ మార్కెట్లను డెల్టా వేరియెంట్, థర్డ్ వేవ్ కలవరానికి గురి చేస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్ ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే సెకండ్ వేవ్ ప్రభావం అంతగా లేదు. ఇప్పటికే వ్యాక్సినేషన్ చాలా మేరకు పూర్తి కావడం, ప్రజలు అప్రమత్తమంగా ఉండటం వంటి అంశాలతో థర్డ్ వేవ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై, తద్వారా సూచీలపై అంతగా ఉండకపోవచ్చునని అంటున్నారు. గోల్డ్ ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఒక్కరోజులో రూ.1.42 లక్షల కోట్లు డౌన్
నిన్న సెన్సెక్స్ 486, నిఫ్టీ 152 పాయింట్లు నష్టపోయింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.42 లక్షల కోట్లు తగ్గి రూ.230.79 లక్షల కోట్లకు చేరుకుంది. ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అదే సమయంలో ఆటో, ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి.