Moratorium, వారికి ప్రయోజనం అవసరం లేదు: క్రెడిట్ కార్డు కస్టమర్లకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుదారులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి లోన్ మారటోరియం ప్రయోజనాలు ఎందుకు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం కాలానికి సంబంధించి బ్యాంకు రుణగ్రహీతల చక్రవడ్డీని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీం షాకిచ్చింది.
Loan Moratorium: ఇంకా చేస్తే బ్యాంకులు తట్టుకోలేవ్, బాధ్యత బ్యాంకులదే
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎందుకు
లోన్ మాటోరియంకు సంబంధించి చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి అవసరం లేదని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణగ్రహీతల కిందకు రారని పేర్కొంది. వారు రుణాలు పొందలేదని, కొనుగోళ్లు చేశారన తెలిపింది. పర్సనల్ లోన్ మొదలు క్రెడిట్ కార్డు వినియోగదారుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. చక్రవడ్డీ మాఫీకి కేంద్రం సుముఖంగా ఉంది. అయితే ఆర్బీఐ అంగీకరించడం లేదు. చక్రవడ్డీని మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్బీఐ తెలిపింది.
మెసేజ్ వచ్చిందని...
తాను క్రెడిట్ కార్డు వినియోగదారుడిని అని, తనకు ఇటీవల చక్రవడ్డీ మాఫీ ఎక్స్గ్రేషియాకు సంబంధించి సందేశం వచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు 'క్రెడిట్ కార్డు వినియోగదారులు కొనుగోళ్లు జరుపుతున్నారు. వారు రుణాలు తీసుకోలేదు. వారికి ప్రయోజనం అవసరం లేదు' అని తెలిపింది.
అభిప్రాయం తెలిపిన కేంద్రం
కాగా, మారటోరియం కాలంలో వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి సుప్రీం కోర్టుకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇది ఆర్థిక విధానాలకు సంబంధించినదని, ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని తెలిపింది. ఇప్పటికే చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తున్నామని, మరింత ఉపశమనం కల్పిస్తే బ్యాంకింగ్ రంగం మనలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇప్పటికే చక్రవడ్డీని తాము భరించామని, ఇంకా ఉపశమనాలు కల్పించలేని పరిస్థితి అని, అలా చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుందని స్పష్టం చేసింది.