ఇప్పటికీ ఆర్బీఐ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు: స్వామి ప్రశ్న
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పడిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలో 80 కనిష్టానికి చేరుకోవచ్చుననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నాటి సెషన్లో ఓ సమయంలో 77 దాటి దారుణ పతనం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణియన్ స్వామి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)ని ఉద్దేశించి కీలక ట్వీట్ చేశారు.
'డాలర్ టర్మ్స్లో భారత జీడీపీ ఒక వారంలోనే 3 ట్రిలియన్ డాలర్ల నుండి 2.9 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫారెక్స్ రేట్ డాలర్ మారకంతో 75 రూపాయల నుండి 77కు పతనం కావడం ఇందుకు కారణం. ఒకవేళ ఇది 80 రూపాయల స్థాయికి పడిపోతే జీడీపీ మరింత తగ్గి 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అప్పుడు మన లక్ష్యం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మరింత కష్టమవుతుంది. పారెక్స్ రిజర్వ్స్ 640 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్బీఐ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు' అని ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మన రూపాయిపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం మరింత ఎక్కువైతే రూపాయి విలువ ఇంకాస్త పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పరిస్థితులు సానుకూలంగా లేకుంటే డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80 నుండి 82ను తాకినా ఆశ్చర్యం లేదంటున్నారు.