20 ఏళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ వినియోగం డౌన్: కారణాలివే..
భారత్లో చమురు వినియోగం భారీగా పడిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరంలో వినియోగం పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఏకంగా 9.1 శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా చమురు వినియోగం తగ్గింది. 1998-99 ఆర్థిక సంవత్సరం తర్వాత వినియోగం తగ్గడం ఇదే మొదటిసారి.
2019-20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 194.63 మిలియన్ టన్నులకు తగ్గింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) ఈ మేరకు డేటా విడుదల చేసింది.
జనవరి-మార్చిలో హౌసింగ్ సేల్స్ జంప్, హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
ఎల్పీజీ వినియోగం జంప్
కరోనా కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ఇతర చమురు వినియోగం భారీగా తగ్గినప్పటికీ, ఎల్పీజీ గ్యాస్ వినియోగం మాత్రం పెరిగింది. మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్, ఆ తర్వాత ఆంక్షల నేపథ్యంలో ప్రజలు బయటకు రాలేకపోయారు. దీంతో వినియోగం పడిపోయింది.
డీజిల్ వినియోగం భారీగా 12 శాతం తగ్గిపోయి 72.72 మిలియన్ టన్నులకు, పెట్రోల్ వినియోగం 6.7 శాతం తగ్గి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్ మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతం నుండి 25.59 శాతానికి పెరిగింది. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది.
జెట్ ఫ్యూయల్ వినియోగం
దాదాపు ఏడాది కాలం మూతపడిన విమాన సర్వీసులు ఆ తర్వాత పాక్షికంగా ప్రారంభమయ్యాయి. దీంతో జెట్ ఫ్యూయల్(ATF) వినియోగం 53.6 శాతం తగ్గి 3.7 మిలియన్ టన్నులు నమోదయింది. కార్యకలాపాలు నిలిచిపోవడంతో డీజిల్ వినియోగమే అన్నింటి కంటే ఎక్కువగా 12 శాతం క్షీణించింది.
నాఫ్తా అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది.
క్రమంగా పూర్వస్థితికి
కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో భారీగా క్షీణించిన వినియోగం రెండో అర్ధ సంవత్సరంలో పెరిగింది. గతేడాది సెప్టెంబర్లో పెట్రోల్ అమ్మకాలు తిరిగి కరోనా పూర్వస్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్ కారణంగా డీజిల్ విక్రయాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్ 18 శాతం పెరిగి 18.77 మిలియన్ టన్నులకు చేరుకుంది. డీజిల్ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్ డిమాండ్ 25.7 శాతం పెరిగింది. గత మార్చి నెలలో బేస్ స్థాయి తక్కువగా ఉండటం ఇందుకు కొంత కారణం.