గూగుల్-ఫేస్బుక్.. అదొక్కటే కారణం... ప్రత్యర్థుల్ని ముఖేష్ అంబానీ ఎలా ఏకతాటిపైకి తెచ్చారు?
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలో అంతర్జాతీయ సెర్చింజన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టాయి. వేర్వేరు ప్లాట్ఫామ్స్ అయినప్పటికీ వ్యాపారంలో ఈ రెండు పోటీ పడుతున్నాయి. ఓ విధంగా ప్రత్యర్థులు. ఇద్దరు అంతర్జాతీయ ప్రత్యర్థులను ముఖేష్ అంబానీ ఒకేతాటి పైకి తీసుకు వచ్చి తమ సంస్థలో పెట్టుబడులు పెట్టేలా చేయగలిగారు. అయితే ఈ రెండు దిగ్గజ కంపెనీలు ఒకేచోట పెట్టుబడి పెట్టడానికి కారణం ఏమిటి?
ముఖేష్ అంబానీ వ్యాఖ్యలు, భారీగా కుంగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్
ప్రత్యర్థుల్ని ముఖేష్ అంబానీ ఎలా ఒక్కటి చేశారు?
ఫేస్బుక్ ఏప్రిల్ నెలలో రూ.43,574 కోట్లతో జియో ప్లాట్ఫామ్స్లో 9.9 శాతం వాటాను కొనుగోలు చేసింది. నిన్న రిలయన్స్ ఏజీఎం సందర్భంగా ముఖేష్ అంబానీ గూగుల్ పెట్టుబడుల గురించి ప్రకటించారు. ఈ సెర్చింజన్ దిగ్గజం రూ.33,737 కోట్లతో 7.7 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపారు. ఈ రెండు సంస్థలు ఒకే ప్లాట్ఫాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒకే కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే ప్రపంచంలోని రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్లో అవకాశాలు. చైనాలో ఫేస్బుక్, జియో బ్యాన్ అయ్యాయి. డ్రాగన్ కంట్రీ సొంత టెక్నాలజీని ఉపయోగిస్తోంది. చైనా తర్వాత రెండో జనాభా కలిగిన దేశం ఇండియా. ఇక్కడ తమ మార్కెట్ను విస్తరించుకోవడం అవసరం. ఈ కారణమే వారిద్దరిని కలిపిందని చెబుతున్నారు.
గూగుల్ వర్సెస్ ఫేస్బుక్
సాధారణంగా గూగుల్, ఫేస్బుక్ రెండు వేర్వేరు భిన్నమైనవి. అయితే ఈ కంపెనీలు ఓ స్థాయికి వెళ్లాక వారి లక్ష్యాలు దాదాపు ఒకేవిధమైనవి అయ్యాయి. వీడియోలకు మార్కెట్ ఉందని భావించిన ఫేస్బుక్ ఆ తతర్వాత న్యూస్ ఫీడ్ను ప్రమోట్ చేస్తోంది. ఫేస్బుక్ వాచ్ క్లిక్ అయింది. సాధారణంగా ఇదివరకు గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ లింక్స్ ఫేస్బుక్లో వైరల్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. అంతకుముందు గూగుల్ తన సొంత గూగుల్ ప్లస్ను తీసుకు వచ్చింది. కానీ అది ఫెయిల్ అయింది. మొత్తానికి రెండు టెక్ దిగ్గజాలు ఒకలక్ష్యంతో పోటీగా ముందుకు సాగుతున్నాయి.
ఇదీ వారికి ప్రయోజనం
అమెరికాలో ఈ రెండు కంపెనీలకు సంతృప్తికర మార్కెట్ ఉంది. చైనా, భారత్ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు. చైనాలో ఈ టెక్ దిగ్గజాలకు అవకాశం లేదు. మిగిలింది భారత్. ఇండియాలో రికార్డ్ స్థాయిలో తక్కువ ధరకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ముప్పై నుండి నలభై కోట్ల మంది కొత్త ఇంటర్నెట్ యూజర్లకు తోడు ఇప్పటికే జియోకు ఉన్న బేస్.. తమకు కలిసి వస్తుందని గూగుల్, ఫేస్బుక్ భావిస్తున్నాయి. అలాగే, ఆ కంపెనీల టెక్నాలజీ జియోకు ప్రయోజనకరంగా మారుతుంది. మొత్తానికి పరస్పర ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఈ టెక్ దిగ్గజాలకు మరింత మార్కెట్ పెరుగుతుంది. అందుకే వ్యాపార ప్రత్యర్థులుగా భావిస్తున్న వీరు మన దేశంలో ఒకే కంపెనీలో పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. 2019 నాటికి ఇండియాలో 560 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇది 50 శాతం మాత్రమే. దాదాపు అందరికీ చేరితే ఎంతో ప్రయోజనం అవుతుంది.