2020లో భారత కుబేరుల సంపద తగ్గింది: అంబానీ సంపద గంటకు రూ.90 కోట్లు
కరోనా మహమ్మారి కారణంగా భారత కుబేరుల సంపద 2020లో 4.4 శాతం క్షీణించి 12.83 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ, సైరస్ పూనావాలా సంపద పెరిగింది. ఈ మేరకు క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ వెల్లడించింది. కరోనా కారణంగా బిలియనీర్ల సంపద తగ్గడంతో వారి సంఖ్య కూడా తగ్గింది. ఈ ముగ్గురి సంపద పెరిగినప్పటికీ బిలియనీర్ల సంపద, సంఖ్య తగ్గింది. 2019తో పోలిస్తే 59,400 కోట్ల డాలర్లు అంటే 4.4 శాతం తగ్గి 2020లో 12.833 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది మన కరెన్సీలో రూ.962 లక్షల కోట్లు. రూపాయి పతనం ఇందుకు కారణమని తెలిపింది.
భారత్ వాటా 1 శాతం
డాలర్ రూపంలో మిలియనీర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా, 2020లో 6,98,000కు పరిమితమైంది. వీరి మొత్తం సంపద వ్యాల్యూ 2019 కంటే 4.4 శాతం (594 బిలియన్ డాలర్లు) తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్ల (రూ.962 లక్షల కోట్లు)గా ఉంది. అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ వాటా 1 శాతంగా ఉంది. 2025 నాటికి భారత్లో మిలియనీర్ల సంఖ్య 81.8 శాతం పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు ఉన్నాయి.
సంపద పెరిగింది
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షల కోట్లు పెరిగి 5.61 కోట్లకు చేరుకుంది. వీరి సంపద వ్యాల్యూ 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020లో సగటున భారత్లో ప్రతి యువకుడు/యువతి వద్ద 14,252 డాలర్ల ఆదాయం ఉంది. 2000 సంవత్సరం నుండి ఇది ప్రతి ఏటా 8.8 శాతం పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8 శాతంగా మాత్రమే ఉంది.
ముఖేష్ సంపాదన గంటకు రూ.90 కోట్లు
50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4320 మంది వరకు భారత్లో ఉన్నారు. హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గత ఏడాది గంటకు రూ.90 కోట్లు పెరిగింది. 2020లో మొత్తం రూ.2,77,700 కోట్లు పెరిగి రూ.6,58,400 కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద రూ.1620 కోట్ల డాలర్లు పెరిగింది.