గుడ్న్యూస్: ఆ ప్రకటన వెనక్కి! స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు యథాతథం
ఢిల్లీ: ఎన్ఎస్సీ, పీపీఎఫ్ సహా వివిధ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను తగ్గించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను ఈ వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మలమ్మ మాట్లాడుతూ.. స్మాల్ సేవింగ్స్ స్కీంపై వడ్డీ రేట్లు తగ్గించే ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటోందన్నారు. దీనిని సవరించుకుంటున్నట్లు చెప్పారు.
2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల నుండి 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు నిన్న తెలిపింది. గత ఏడాది కాలంలో స్మాల్ సేవింగ్స్ స్కీం పైన వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఇది రెండోసారి. 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 70 బేసిస్ పాయింట్ల నుండి 140 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అయితే నిన్న తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
స్మాల్ సేవింగ్స్ స్కీం పథకాలపై వడ్డీ రేట్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో చివరిసారి కొనసాగినట్లుగానే కొనసాగుతాయని నిర్మలమ్మ తెలిపారు. అంటే FY21లో మార్చి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి.