LIC ఉద్యోగులకు శుభవార్త, 20 శాతం వరకు వేతన పెంపు
ప్రభుత్వరంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ వారంలో తన ఉద్యోగులకు శుభవార్త అందించనుంది. గత నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న వేతన పెంపుపై ఈ వారం చివరలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేతన పెంపు విషయమై ఎల్ఐసీ నాయకత్వం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి.
గతంలో 16 శాతం వేతన పెంపు
వేతన పెంపు 18.5 శాతం నుండి 20 శాతం మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 1, 2017 నుండి ఉద్యోగుల వేతనాలు పెంచవలసి ఉంది. కానీ వాయిదా పడింది. వేతన పెంపు నిర్ణయం వాయిదాపడటం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు వేతన పెంపు సంకేతాలు ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్తే. ఇది వారికి సంతృప్తిని కలిగించే విషయం. ఎల్ఐసీ యాజమాన్యం గతంలో 16 శాతం వేతన పెంపును అమలు చేసింది.
ఐపీవో సమయంలో వేతన పెంపు
వేతన పెంపుతో పాటు ఎల్ఐసీ మేనేజ్మెంట్ హోమ్ లోన్ పైన 100 బేసిస్ పాయింట్ తగ్గింపును ప్రకటించింది. కొత్త వేతన సవరణలో 18.5 శాతం నుండి 20 శాతం మేర (సూపర్యాన్యుయేషన్ మినహా) ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు రానుంది. ఈ బీమా దిగ్గజం ఐపీవోకు వచ్చే సమయంలో ఉద్యోగులకు వేతనాలు పెరుగుతున్నాయి.
రెండంకెల వృద్ధి
ఎల్ఐసీ FY21లో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పోరేషన్ వృద్ధి పది శాతం పెరిగిందని చైర్మన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. సమాచారం మేరకు ఎల్ఐసీ కొత్త బిజినెస్ 11 నెలల కాలంలో (ఫిబ్రవరి 2021 నాటికి) ప్రాఫిట్ రూ.1,56,068 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది మాత్రం 3 శాతం తక్కువ.