IPO News: మార్కెట్లోకి మరో ఐపీవో.. కంపెనీకి ఫుల్ ఆర్డర్స్.. 32 దేశాలతో వ్యాపారం..
IPO News: ప్రస్తుతం మన దేశంలో ఐపీవోల సీజన్ నడుస్తోంది. ఇదే సమయంలో సెబీ మరో కంపెనీ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్లో నిధుల సమీకరణ కోసం విక్రమ్ సోలార్ మార్చిలో సెబీకి ప్రారంభ IPO పత్రాలను సమర్పించింది. అయితే తాజాగా కంపెనీ సెబీ నుంచి ఇందుకోసం అనుమతులు పొంది లిస్టింగ్ కోసం సన్నాహాలు చేసుకుంటోంది.
రానున్న కాలంలో సోలార్ ఎనర్జీ రంగంలోని కంపెనీలు మంచి రాబడులను అందించే అవకాశం ఉంది. భవిష్యత్ టెక్నాలజీగా ఉన్న సోలార్ రంగంలో ఈ కంపెనీ రావటంపై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.1,500 కోట్లను షేర్ల ఇష్యూ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా వాటాదారుల ద్వారా 50 లక్షల వరకు ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) తీసుకురాబడుతుంది.
ఐపీవో అర్హత కోసం విక్రమ్ సోలార్ మార్చిలో సెబీని సంప్రదించింది. ఈ తరుణంలో ఆగస్టు 10న సెబీ అనుమతులు లభించాయి. కొత్త IPO ద్వారా వచ్చే ఆదాయంతో 2,000 మెగా వాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్లాస్పెక్టస్ పత్రాల్లో మార్కెట్ రెగ్యులేటర్ కు వెల్లడించింది.
కంపెనీ డిసెంబర్ 31, 2021 వరకు 32 దేశాల్లోని వినియోగదారులకు సోలార్ PV మాడ్యూళ్లను సరఫరా చేసింది. డిసెంబర్ 2021 నాటికి కంపెనీ రూ.4,870 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ను కలిగి ఉంది. కంపెనీ షేర్లు ఐపీవో తరువాత బిఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదుకానున్నాయి. సోలార్ ప్యానెల్స్ తయారీలో కంపెనీ దేశంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది.