మోగుతున్న టెక్ వార్నింగ్ బెల్.. అయోమయంలో US టెక్ సీఈవోలు.. భారత్ పై భారీగా ప్రభావం..
Tech Companies: కష్టాల సుడిగుండంలో టెక్ కంపెనీలు చిక్కుకున్నాయి. అగ్రరాజ్యంలోని బఢా ఐటీ కంపెనీలు దీనికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. వీటిని నడుపుతున్న సీఈవోలు సైతం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. తాము తీసుకుంటున్న చర్యలు సరిపోవటం లేదని ఇన్వెస్టర్ల అసంతృప్తి నుంచి వారు గ్రహిస్తున్నారు.
సిలికాన్ వ్యాలీ..
చాలా ఆలోచనలకు రూపాన్ని ఇచ్చిన ప్రదేశంగా సిలికాన్ వ్యాలీని పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కష్టాలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు అక్కడి అతిపెద్ద దిగ్గజాలను కూడా మోకరిల్లేలా చేశాయని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. భవిశా ఇలాంటి పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి అక్కడి సీఈవోలకు సైతం పూర్తిగా తెలీదు.
కరోనా సమయంలో..
కరోనా మహమ్మారి సమయంలో ఆదాయాలు దెబ్బతిన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు దూకుడుగా ఖర్చుచేయటం టెక్ కంపెనీలు స్పీడ్ పెంచటానికి దారితీసింది. కానీ వారు ఇప్పుడు ఆకస్మిక మందగమనానికి గురికావటంతో దిక్కుతోటని స్థితిలోకి వెళ్లిపోయారు.
కంపెనీల లోపాలు..
అనేక సంవత్సరాలుగా పెద్ద టెక్ కంపెనీలు లాభదాయకమైన కొత్త ఆలోచనలను కనుగొనలేకపోయాయి. అయితే ఇప్పుడు బిగ్ టెక్ కంపెనీల్లోని అనేక లోపాలు కష్ట కాలంలో బయటకు వస్తున్నాయి. గూగుల్, మెటా ఇప్పటికీ ఎక్కువగా యాడ్ సేల్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతుండగా.. ఆపిల్ ఇప్పటికీ ఐఫోన్ లాభాలతోనే నెట్టుకొస్తోంది. ఇవి కూడా టిక్ టాక్ వంటి కష్టాలను ఎదుర్కోవచ్చని నిపుణులు అంటున్నారు.
దెబ్బతిన్న తయారీ..
కొనుగోళ్లలో భారీగా ఏర్పడిన మందగమనం సెమీకండక్టర్ కంపెనీలను కూడా ప్రభావితం చేసింది. ఇవి ఫ్యాక్టరీలు, యంత్రాలపై ఖర్చులను భారీగా తగ్గించాయి. అయితే పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఉపకరణాల అమ్మకాలు నెమ్మదిగా ఉండటంతో ఉత్పత్తితో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా అవి తగ్గిస్తున్నాయి. ఇటీవల ఇంటెల్ కంపెనీ ఉద్యోగుల తొలగింపుకు ఇదే కారణాన్ని వెల్లడించింది. చైనాలో తయారీ నిర్వహిస్తున్న కంపెనీల కష్టాలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
అప్పట్లో అవకాశం..
కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కి మారటం వల్ల అప్పట్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల డిమాండ్ పెరిగింది. కానీ అది తాత్కాలిక వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. అదే సమయంలో వ్యాపారులు క్లౌడ్ స్టోరేజ్, వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశాయి. ప్రజలు ఆన్లైన్ షాపింగ్ను ఆశ్రయించారు. అలా యాడ్ రెవెన్యూ, సేల్స్, టెక్నికల్ సపోర్ట్, ఐటీ సర్వీసెస్ రంగాల్లోని దిగ్గజ కంపెనీలు భారీగా లాభపడ్డాయి.
ప్రస్తుతం అంతా తారుమారు..
కరోనా తరువాత కంపెనీల అంతా నార్మల్ అవుతుందని భావించినా.. ప్రస్తుతం ఆవరించిన అతిపెద్ద ఆర్థిక మాంద్యం ప్రజల ఖర్చులను తగ్గించగా, కంపెనీలు సైతం ఖర్చులను తగ్గించుకునేందుకు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ప్రకటను తగ్గించుకున్నాయి. ప్రజలు సైతం ముఖ్యమైన వాటికి తప్ప, మిగిలిన ఖర్చులను తాత్కాలికంగా లేదా పూర్తిగా వాయిదా వేసుకోవటం సిలికాన్ వ్యాలీ టెక్ కంపెనీల సీఈవోలకు నిద్ర లేకుండా చేస్తోంది.
తాజా ఆర్థిక ఫలితాలు..
అమెరికాలోని ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి కంపెనీలు విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు ఇదే నిరూపిస్తున్నాయి. ఈ పేలవ పనితీరుతో ఇన్వెస్టర్లు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. కంపెనీల మార్కెట్ విలువ రోజురోజుకూ పేకమేడల్లా కూలిపోతోంది.
ఆవిరవుతున్న ఈ సంపద భారత ఐటీ పరిశ్రమ అలర్ట్ కావాలంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. ఎందుకంటే భారత టెక్ కంపెనీలకు ఎక్కువగా ప్రాజెక్టులు అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచే వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండు మార్కెట్లు ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నాయి. ఇది పరోక్షంగా భారత టెక్కీల జీవితాలను సైతం ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి.