t+1 settlement: చరిత్ర సృష్టించిన భారత్.. ఇండియాను ఫాలో కానున్న అమెరికా..
t+1 settlement: పెట్టుబడిదారులు, ట్రేడర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. స్టాక్ మార్కెట్ నియమ నిబంధనల్లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పలు మార్పులు చేస్తుంటుంది. 30 ఏళ్ల క్రితం 2003లో ట్రేడ్ సెటిల్ మెంట్ పీరియడ్ ను 'T+3' నుంచి 'T+2' కి మార్చింది. కాగా ఈ ఏడాది జనవరి 27 నుంచి 'T+1' కి తగ్గించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అంటే శుక్రవారం నుంచి స్టాక్ మార్కెట్ లో చేసే ప్రతి లావాదేవీ తరువాతి రోజులోపు క్లియర్ చేయబడతాయన్నమాట. అగ్రరాజ్యం అమెరికా సైతం భారత్ నడుస్తున్న దారిలోకి రావాలని చూస్తుండటం విశేషం.
తొలి దేశంగా భారత్
సెటిల్ మెంట్ పీరియడ్ తగ్గించే ప్రక్రియ జనవరి 1, 2022 నుంచి ఇండియాలో మొదలుకాగా.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అమెరికా ఇప్పుడు చూస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యాన్ని వెనక్కు నెట్టి వేగంగా 'T+1' సైకిల్ కి మారిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
రెండేళ్లలో ప్రణాళికాబద్ధంగా తక్కువ సైకిల్ కు మరేందుకు US సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై వాటారుల అభిప్రాయం తెలపాలని కోరింది. ఐరోపాలోని మార్కెట్ వర్గాల్లో సైతం ఈ దిశగా చర్చలు జరుగుతున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
అమెరిగా సైతం ఇండియా బాటలో..
సెక్యూరిటీల క్లియరెన్స్, సెటిల్మెంట్లో నష్టాలను తగ్గించడానికి నిబంధనల్లో మార్పులు అవసరమని US SEC గతేడాది అభిప్రాయం వ్యక్తం చేసింది.
సెటిల్ మెంట్ సైకిల్ తగ్గించడం వల్ల పెట్టుబడిదారులకు నగదు లభ్యత పెరగడంతో పాటు లిక్విడిటీ రిస్క్ తగ్గించే అవకాశం ఉంటుందని SEC అధికారి గ్యారీ జెన్స్లర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవాడనికి ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
అతిపెద్ద మార్కెట్ గా భారత్
మార్కెట్ క్యాప్ ఆధారంగా చిన్న నుంచి పెద్ద వరకు వివిధ దశల్లో మొత్తం స్టాక్ లను T+1 చెల్లింపు విధానానికి భారత్ మార్చింది. చివరి బ్యాచ్ లో భాగంగా.. దాదాపు 256 లార్జ్ క్యాప్, బ్లూ చిప్ స్టాక్ లు ఈ విధానానికి మారనున్నాయి.
తద్వారా ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్ గా భారత్ మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. US, యూరప్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్టు ఇప్పటికీ T+2 విధానంలోనే ఉండటం మనకు కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు.