భారత్ సహా ఆ దేశాల దెబ్బతో టిక్టాక్ ఉక్కిరిబిక్కిరి, దిక్కుతోచక కీలక నిర్ణయం!
భద్రతా కారణాలతో భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 యాప్స్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాలు కూడా ఈ షార్ట్ వీడియో యాప్ను బ్యాన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో యాంటీ-చైనా సెంటిమెంట్ బలంగా వీస్తోంది. ఈ ప్రభావం టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ పైన తీవ్రంగా పడుతోంది. దీంతో ఈ చైనీస్ కంపెనీ టిక్ టాక్ ఫౌండర్ ఝాంగ్ యామింగ్ తన యాప్ను యాంటీ-చైనా సెంటిమెంట్ నుండి కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు.
టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?
చైనా సెంటిమెంట్ను అధిగమించేందుకు...
టిక్ టాక్ యాప్ను సేవ్ చేయడం కోసం ఇందులో కొన్ని వాటాలను అమెరికా సహా వివిధ దేశాల ఇన్వెస్టర్లకు విక్రయించడం ద్వారా చైనా యాప్ ముద్రను తొలగించుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా చైనా తర్వాత ఎక్కువ ఆదాయం వస్తున్న అమెరికాలో ఈ యాప్ నిషేధం వల్ల పెద్ద మొత్తంలో రెవెన్యూ పడిపోతుంది. ట్రంప్ యాంటీ-చైనా సెంటిమెంట్ నుండి బయటపడేందుకు అమెరికా ఇన్వెస్టర్లకు కొంత వాటాను విక్రయించనున్నారని తెలుస్తోంది. మంచి లాభాలతో నడుస్తున్న ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయట.
అమెరికాపై ప్రత్యేక దృష్టి
అమెరికన్ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించడంతో పాటు వివిధ రకాలుగా ఈ యాప్ను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా నుండి సాధ్యమైనంత ఎక్కువగా టిక్ టాక్ కార్యకలాపాలు నిర్వహించడం, అమెరికన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ను హైర్ చేసుకోవడం, భద్రతాపరమైన విధానాలపై అమెరికా ప్రభుత్వానికి హామీ ఇవ్వడం, అమెరికా ప్రజలకు చెందిన డేటాను మరో దేశానికి ఇవ్వడం లేదని చెప్పడం ద్వారా ఈ యాప్ను సేవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
10,000 ఉద్యోగాలు
అంతేకాదు, అమెరికాలో 10,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని వాషింగ్టన్కు హామీ ఇవ్వనుంది టిక్ టాక్ యాజమాన్యం. దీంతో పాటు అమెరికా స్టార్స్కు సపోర్ట్ చేయడం కోసం 200 మిలియన్ డాలర్ల ఫండ్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఇండియాలో నిషేధించారు. ఇతర దేశాల్లో చర్యలు తీసుకోవడానికి ముందే బైట్ డ్యాన్స్ జాగ్రత్త పడుతోంది. అలాగే ఇండియాతోను సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత పరిస్థితితో టిక్ టాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
దిక్కుతోచని పరిస్థితుల్లో...
ప్రస్తుతం బైట్ డ్యాన్స్ వ్యాల్యూ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. కేకేఆర్, టైగర్ గ్లోబల్, సాఫ్ట్ బ్యాంకు, సెక్వోయిమా, జనరల్ అట్లాంటిక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఈ యాప్స్ను నిషేధించే విషయంలో భారత్ దారిలో నడవాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్కు లేఖ కూడా రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకుంటోంది ట్రంప్ పరిపాలనా విభాగం. భద్రత, సమాచార గోప్యత, సమాచార స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వంటి అనేక విషయాలపై ఆస్ట్రేలియా చర్చిస్తోంది. దీంతో దిక్కుతోచని.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పరిస్థితుల్లో మెజార్టీ వాటాను అమ్మి చైనా ముద్రను తొలగించుకునేందుకు బైట్ డ్యాన్స్ సిద్ధమైందట. అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని కూడా చైనా బయటకు తరలించాలని, కొత్త బోర్డును ఎంపిక చేయాలని భావిస్తోంది.