చైనా, ఉత్తర కొరియాలను గెలికిన అమెరికా: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ బ్లాక్లిస్ట్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా- డ్రాగన్ కంట్రీ చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదివరకు- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైన ఈ ట్రేడ్ వార్ క్రమంగా ముదిరి పాకాన పడేలా ఉంది. చైనాపై మాత్రమే కాకుండా కొత్తగా బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తర కొరియాలపైనా ఆంక్షలను విధించింది. మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ యథేచ్ఛగా సాగుతోందనే కారణంతో అమెరికా తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
IPL 2022: ప్రసార హక్కుల కోసం రిలయన్స్, అమెజాన్ సహా: రూ.40 వేల కోట్లు బిడ్డింగ్
ఆసియా దేశాలపైనే
అక్కడితో ఆగలేదు అగ్రరాజ్యం. మరో అడుగు ముందుకేసింది. సెన్స్టైమ్ గ్రూప్ను బ్లాక్ లిస్ట్లోకి చేర్చింది. అమెరికా నిర్ణయాన్ని కెనడా, యునైటెడ్ కింగ్డమ్ సమర్థించాయి. తాము కూడా అదే రకమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలు ఆయా దేశాల మధ్య కొనసాగుతూ వస్తోన్న దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింత దెబ్బతీస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా తాజాగా విధించిన ఆంక్షలను ఎదుర్కొంటోన్న నాలుగూ ఆసియా దేశాలే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముస్లింల అణచివేతకు నిరసనగా..
చైనాలోని గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్ఘుర్ తెగకు చెందిన ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. వారిపై చైనా ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందంటూ చాలారోజుల నుంచీ వార్తలు వెలువడుతోన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఇప్పటికే చైనాపై వాణిజ్యపరమై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్లో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది అమెరికా.
బంగ్లాదేశ్, మయన్మార్పైనా
ఇప్పుడు తాజాగా- బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తర కొరియాలపై కూడా కొరడా ఝుళిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా తీసుకుంటోన్న నిర్ణయాలు ఆసియాలో ఉద్రిక్తతలకు దారి తీస్తాయని అంటున్నారు. మయన్మార్లో సైనిక పాలన కొనసాగుతోంది. అక్కడ అధికారంలో ఉన్న ఎన్ఎల్డీ ప్రభుత్వాన్ని కూలదోసి మరీ అక్కడి సైన్యం అధికారంలోకి వచ్చింది. తమకు ఎదురు తిరిగిన వారిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేస్తోంది. కొద్దిరోజుల కిందటే అంగ్సాన్ సూకీని నాలుగు సంవత్సరాల పాటు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం జైలు శిక్షను విధించింది.
స్వేచ్ఛాయుత వాతావరణం లేదంటూ..
ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన సైతం ఉందని అమెరికా చెబుతోంది. ఆధునిక నియంతగా గుర్తింపు పొందిన కిమ్జొంగ్ ఉన్ హయాంలో ఆ దేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే వాతావరణం, అనుకూల పరిస్థితులు లేవని అంటోంది. దీనితోపాటు అణ్వస్త్రాల నిషేధ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అమెరికా డిప్యూటీ ట్రెజరీ కార్యదర్శి వాల్లీ అడెయెమొ తెలిపారు. వైట్ హౌస్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఆంక్షలను విధించామని అన్నారు.
చైనా కంపెనీ బ్లాక్ లిస్ట్..
కాగా- చైనాకు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సెన్స్టైమ్ గ్రూప్ను అమెరికా బ్లాక్ లిస్ట్లోకి చేర్చింది. కీలక సమాచారం తస్కరణకు గురవుతోందనే కారణాన్ని చూపింది అమెరికా. అమెరికా తమను బ్లాక్ లిస్ట్లో పెట్టడాన్ని సెన్స్టైమ్ గ్రూప్ తప్పు పట్టింది. దీన్ని నిరసిస్తున్నామని స్పష్టం చేసింది. బ్లాక్ లిస్ట్లో చేర్చడానికి అమెరికా ప్రభుత్వం సరైన కారణాన్ని వెల్లడించట్లేదని, యథాలాపంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీనిపై తాము నిరసనను తెలియజేస్తామని సెన్స్టైమ్ గ్రూప్ యాజమాన్యం తెలిపింది.