గంటలపాటు నిలిచిపోయిన ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ట్రాన్సాక్షన్స్
యూపీఐ సర్వర్ డౌన్ కావడం వల్ల పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) ఆదివారం నాడు (జనవరి 9, 2022) గంటపాటు డౌన్ అయింది. దీంతో వ్యాలెట్ మొబైల్ యూజర్లు ఇబ్బందులు పడ్డారు. తాము డిజిటల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు జరపలేకపోతున్నట్లు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
NPCI సాయంత్రం ఈ అంశంపై స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రస్తుతం యూపీఐ వర్క్ చేస్తోందని, దీనిని తాము మానిటర్ చేస్తున్నామని ఎన్పీసీఐ నిన్న సాయంత్రం ట్వీట్ చేసింది.
యూపీఐని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. తత్ఫలితంగా గూగుల్ పే, భారత్ పే, పేటీఎం వంటి మొబైల్ వ్యాలెట్ చెల్లింపులకు ఇబ్బందులు కలిగాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఎన్పీసీఐ రంగంలోకి దిగి, గంటల్లో దీనిని సరిదిద్దింది. కొంతమంది తమకు ఎదురైన సమస్యపై ఫిర్యాదు చేయగానే స్పందించినట్లు తెలిపింది.