అదొక ‘ఆభరణం’.. ఆమ్మేస్తారా?: ఎయిర్ ఇండియాపై యూనియన్ల భావోద్వేగం
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విక్రయానికి కేంద్రం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో 100 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల పార్లమెంటులోనూ వెల్లడించారు.
అయితే మరోవైపు ఎయిర్ ఇండియాకు చెందిన వివిధ యూనియన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భావోద్వేగంతో కూడిన లేఖ రాశాయి. ఎయిర్ ఇండియా మన దేశానికి ఒక ఆభరణం లాంటిదని.. దానిని విక్రయించరాదంటూ ఆ లేఖలో అభ్యర్థించాయి.
విక్రయానికి డెడ్లైన్.. 2020 మార్చి 31
ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో దాని నిర్వహణ ఇక సాధ్యం కాదని భావించిన కేంద్రం ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియాలో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల పార్లమెంటులో కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విక్రయానికి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీని డెడ్లైన్గా పెట్టుకున్నారు. జనవరిలో దీనికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించనున్నారు.
ఆభరణం లాంటి సంస్థను విక్రయిస్తారా?
దాదాపు రూ.58,000 కోట్ల అప్పులు, వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనేందుకు, ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎయిర్ ఇండియా విక్రయాన్ని ఆ సంస్థకు చెందిన యూనియన్లు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి యూనియన్లు ఓ లేఖను రాశాయి. ఎయిర్ ఇండియా మన దేశానికి ఒక ఆభరణం లాంటిదని ఆ లేఖలో పేర్కొన్న యూనియన్లు సంస్థను విక్రయించరాదంటూ అభ్యర్థించాయి.
6 యూనియన్లు సంయుక్తంగా...
ఎయిర్ ఇండియాను విక్రయించరాదంటూ.. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాబిన్ క్రూ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్ సహా 7 యూనియన్లు సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాయి. ఆయనతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వనీ లొహానీలకు కూడా ఆ లేఖను పంపించాయి. నష్టాలు పూడ్చి, ఎయిర్ ఇండియాను మళ్లీ లాభాల బాట పట్టించడం కష్టసాధ్యమేమీ కాదని అందులో పేర్కొన్నాయి.
రుణాలు మాఫీ చేసి.. అలా చేయండి
గత మూడేళ్లుగా ఎయిర్ ఇండియా లాభాలను ఆర్జిస్తోందని, కాకపోతే ఏటా నిర్వహణ ఖర్చు రూ.4 వేల కోట్ల పైనే ఉండడం వల్ల రుణాల చెల్లింపు పెద్ద సమస్యగా మారిందని యూనియన్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా రుణాలను మాఫీ చేసి, దానిని ఓ ప్రొఫెషనల్ యాజమాన్యానికి అప్పగించి నిర్వహించాలంటూ ఆ లేఖలో కోరాయి. మరి యూనియన్ల భావోద్వేగాన్ని కేంద్ర పెద్దలు అర్థం చేసుకుంటారో, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతారో త్వరలోనే తెలియనుంది.