కరెంట్ సరఫరా కంపెనీని మార్చుకునేందుకు వెసులుబాటు.. పోర్టబిలిటీ ఆప్షన్ ఎప్పటినుంచి అంటే..
Power Connection Portability: ఇప్పటి దాకా మనం మెుబైల్ నెట్ వర్క్ పోర్టబిలిటీ గురించి మనందరికీ తెలుసు. అచ్చం ఇలాంటిదే కరెంట్ కనెక్షన్ విషయంలోనూ రాబోతోంది. మీ ఇంటికి కరెంటు సరఫరా చేసే కంపెనీ సర్వీస్ మీకు నచ్చకపోతే లేదా మీకు కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తోందంటే దానిని మార్చుకునేందుకు వెసులుబాటు రానుంది. తద్వారా రాబోయే కాలంలో మీరు మీ విద్యుత్ కంపెనీని మొబైల్ ఆపరేటర్ కంపెనీల మాదిరిగా మార్చుకోగలుగుతారు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో బిల్లును తీసుకురావచ్చని తెలుస్తోంది.
వర్షాకాల సమావేశాల్లో బిల్లు:
ఈ ఏడాది వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు-2021ని తీసుకురావచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె. సింగ్ గురువారం చెప్పారు. ప్రస్తుతం మొబైల్ ఆపరేటర్ల మాదిరిగానే అనేక విద్యుత్ సంస్థల్లో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛను ఈ బిల్లు ప్రజలకు అందిస్తుంది. ఫిక్కీ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ట్రాన్స్మిషన్ సమ్మిట్-2022లో ప్రసంగిస్తూ సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. ఈసారి వర్షాకాల సమావేశాలు జులై నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి.
వినియోగదారుల ప్రయోజనాల కోసం:
విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని లైసెన్స్ లేకుండా చేయడమే ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఉద్దేశంగా తెలుస్తోంది. దీని కారణంగా మార్కెట్లో పోటీ పెరగనుంది. అంతే కాదు.. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (APTEL)ని బలోపేతం చేయడం కూడా ఈ బిల్లు ఉద్దేశం. ఇందుకోసం ప్రతి విద్యుత్ కమిషన్లో లా నేపథ్యం నుంచి వచ్చిన సభ్యుడిని ప్రభుత్వం నియమిస్తుంది. ఇది కస్టమర్ల హక్కులు, బాధ్యతలను కూడా నిర్వచిస్తుంది.
పవన శక్తిని కొనుగోలు అవసరం:
క్లీన్ ఎనర్జీని కొనుగోలు చేయాలని విద్యుత్ కంపెనీలను కోరతామని కేంద్ర విద్యుత్ మంత్రి సింగ్ చెప్పారు. అలాగే పవన విద్యుత్ కొనుగోలుకు ప్రత్యేక నిబద్ధత ఉంటుందని వెల్లడించారు. ఇది కాకుండా.. అరుణాచల్ ప్రదేశ్లో 30,000 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రణాళికను మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్లో కూడా 5 జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.