పేరు స్వదేశీ..తీరు విదేశీ: ఎల్ఐసీలో 20% ఎఫ్డీఐలకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
ముంబై: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇంకొద్ది రోజుల్లో ప్రైవేటుపరం కాబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు ముగింపుదశకు వచ్చేసింది. మార్చి తొలి లేదా రెండో వారంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఎల్ఐసీలో తనకు ఉన్న వాటాలో కొంత శాతాన్ని కేంద్ర ప్రభుత్వం లిక్విడేట్ చేయనుంది. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలంటే- సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను సెబికి అందజేయాల్సి ఉంటుంది.
కీలక పరిణామం..
ఈ డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ను కొద్దిరోజుల కిందటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. సెబికి సమర్పించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాల్యుయేషన్ కొనసాగుతోంది. ఇది ముగిసిన వెంటనే- సెబి ఈ ప్రాస్పెక్టస్పై ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే అవుతుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
ఎల్ఐసీలో 20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం తీర్మానించింది. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ రూట్లో ఈ 20 శాతం ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
20 శాతం ఎఫ్డీఐ
20 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి అవకాశాన్ని కల్పించడం ద్వారా అంతమేర అవకాశం స్వదేశీయులకు లేనట్టే. 65 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా సమీకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నవిషయం తెలిసిందే. ఈ స్థాయిలో దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడతారా? లేదా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో 20 శాతం మేర ఆటోమేటిక్ రూట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు.
చట్టంలో మార్పులు..
నిజానికి- ఎల్ఐసీ యాక్ట్ 1956 ప్రకారం.. దేశీయ జీవిత బీమా సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గానీ, విదేశీ సంస్థలు లేదా వ్యక్తులు వాటాలను కొనుగోలు చేయడానికి గానీ అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యాక్ట్లో మార్పులుచేర్పులు చేయాలని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్గా అంటే ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఎల్ఐసీలో 20 శాతం మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల కోసం తలుపులు తెరిచింది.
విమర్శలకు ఛాన్స్..
ఎల్ఐసీలోనూ ఎఫ్డీఐలకు మోడీ ప్రభుత్వం అంగీకారం తెలపడం వివాదాస్పదమౌతోంది. ఇదివరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నడిపించిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో లాభాల్లో ఉన్న కంపెనీలను కూడా విదేశీ సంస్థల చేతుల్లో పెడుతోందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఎఫ్డీఐలకు ఎల్ఐసీలో అనుమతి ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.