Union Budget 2022: బడ్జెట్ పత్రాల ముద్రణ క్రమంగా తగ్గింపు.. పర్యావరణహితమే..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యావరణహిత బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక వివరాలు ఉండే బడ్జెట్ ప్రతుల ముద్రణను భారీగా తగ్గించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం బడ్జెట్ పత్రాలు డిజిటల్ రూపంలో లభిస్తాయని, భౌతిక ప్రతులను కొన్ని మాత్రమే ముద్రించనున్నట్లు తెలిపారు. ఇదివరకు వందల సంఖ్యలో బడ్జెట్ పత్రాల ముద్రణ, ఇందుకు భారీ ప్రక్రియ ఉండేది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చాక క్రమంగా పత్రాల ముద్రణ తగ్గింది.
బడ్జెట్ పత్రాల ముద్రణ నేపథ్యంలో ఆ వివరాలు వెలుగు చూడకూడదని ఆర్థిక శాఖ ఉండే నార్త్ బ్లాక్ బేస్మెంట్లోని ముద్రణాలయ సిబ్బంది రెండు వారాల పాటు బయటి ప్రపంచానికి దూరంగా, లోపల పని చేసేవారు. ఆర్థికమంత్రి, సహాయమంత్రులు, సీనియర్ అధికారులు ఆ తర్వాత హల్వా వేడుక నుండి బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమయ్యేది. అయితే ఇటీవల ముద్రణ తగ్గుతోంది. మొదట మీడియా ప్రతినిధులు, ఇతర విశ్లేషకులకు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం తగ్గించారు.
కరోనా తర్వాత లోకసభ, రాజ్యసభ సభ్యులకు కూడా ఇవ్వడం మానివేశారు. ప్రస్తుతం కోవిడ్ ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు రావడంతో పాటు హల్వా వేడుకకు దూరంగా ఉన్నారు. డిజిటల్ రూపంలో బడ్జెట్ పత్రాలు తీసుకు వస్తున్నారు. ఇందుకు కొంతమంది ఉద్యోగులు లోపల పని చేస్తున్నారు.