Twitter: ట్విట్టర్ భవితవ్యం కష్టమే.. మాజీ సీఈవో షాకింగ్ సమాచారం ఏమిటంటే..
Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని హస్తగతం చేసుకున్న తర్వాత చాలా విషయాలను మార్చాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కస్టమర్ల ధృక్కోణంలో అనేక ఫీచర్లను మార్చాలని భావిస్తున్నారు. ట్విట్టర్లో చాలా కాలం పాటు అస్థిర పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అనేక అనుమానాలకు ట్విట్టర్ ఇండియా మాజీ హెడ్ మనీష్ మహేశ్వరి తన ఇంటర్వ్యూలో జవాబిచ్చారు.
ఉత్సాహం నుంచి మూసివేతలు..
ఎలాన్ మస్క్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతిరోజూ కంపెనీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట్లో ఉన్నతాధికారుల తొలగింపులతో పాటు కొంత ఉద్యోగుల తగ్గింపు ఉంటుందని అందరూ భావించారు. అయితే అది చివరికి ట్విట్టర్ కార్యాలయాల మూసివేత వరకు వెళ్లి ఆందోళనలను పెంచేసింది. తాను చెప్పినట్లు విననివారు వెళ్లిపోవచ్చని మెయిల్ లో చెప్పి నచ్చనివారు వెళ్లిపోవచ్చని తెలిపారు.
విధ్వంస మార్గంలోకి వెళ్లాలా?
మస్క్ సృష్టించిన గందరగోళంతో కంపెనీ బ్రాండ్ తన పేరును కోల్పోతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీకి పూర్వ వైభవం రావాలంటే పటిష్టమైన నిపుణుల బృందం అవసరమని తెలుస్తోంది. దీనిని సకాలంలో అమలు చేయకుంటే కంపెనీ విఫలమై.. వినాశకర మార్గంలోకి వెళ్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ట్విట్టర్ కొనుగోలు వెనుక ఉన్న ఉద్ధేశ్యం ఆదాయం కాదని తెలుస్తోంది. అయితే ఇది రాజకీయ వ్యూహమా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్విట్టర్ భవితవ్యం ఏమిటో వేచి చూడాల్సిందే.
ట్విట్టర్ ఆదాయం..
ప్రస్తుతం ట్విట్టర్ ఆదాయంలో 90% ప్రకటనల ద్వారానే వస్తోంది. అయితే కంపెనీ దీర్ఘకాలంలో ముందుకు సాగటానికి సబ్స్క్రిప్షన్ ఆధారితంగా విజయవంతమైన మార్పును సాధించాల్సి ఉంది. ఈ ధృక్కోణంలోనే ఎలాన్ మస్క్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే బ్లూ టిక్ కోసం నెలకు వినియోగదారుల నుంచి 8 డాలర్లను రుసుముగా వసూలు చేయాలని మస్క్ నిర్ణయించారు. దీని కోసం ప్రీమియం-ఆధారిత కంటెంట్ను అందించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల తొలగింపు..
అయితే ప్రస్తుతం ఉన్న వాణిజ్య పరిణామంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున తొలగింపులు కొనసాగవచ్చని ట్విట్టర్ ఇండియా మాజీ సీఈవో మహేళ్వరి వెల్లడించారు. అలాగే రిక్రూట్మెంట్ ప్రస్తుతం భారతదేశంలో ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.