ట్యాక్స్ హాలీ డే.. అదే జరిగితే పారిశ్రామిక రంగానికి బిగ్ బూస్టింగ్.. ఇవే కీలక ప్రతిపాదనలు
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. పారిశ్రామిక రంగం స్తంభించిపోవడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసినా.. పారిశ్రామిక రంగం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మార్కెట్లోకి కొత్త పెట్టుబడులు వస్తాయా లేదా అన్న దానిపై పెద్ద సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలపై ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ట్యాక్స్ హాలీడే..
ఎకనిమక్ టైమ్స్ కథనం ప్రకారం.. దేశంలో కొత్తగా 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మెడికల్ పరికరాలు,ఎలక్ట్రానిక్స్,టెలికాం పరికరాలు,కేపిటల్ గూడ్స్ తదితర రంగాలకు ఇందులో చోటు కల్పించాల్సి ప్రతిపాదనల్లో పేర్కొంది. అయితే ఆ కంపెనీలు ఈ ఏడాది జూన్ 1 నుంచి మూడేళ్ల లోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని షరతు విధించింది.
100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే..
టెక్స్టైల్,ఫుడ్ ప్రాసెసింగ్,లెదర్,ఫుట్వేర్, తదితర రంగాల్లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు నాలుగేళ్ల ట్యాక్స్ హాలీడే(పన్ను మినహాయింపు) ప్రకటించాలని ప్రతిపాదించింది. ఇక రాబోయే ఆరేళ్ల కాలానికి కేవలం 10శాతం కార్పోరేట్ పన్ను రేటును ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఇప్పటికైతే వీటిపై ఆ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరం..
కరోనా కారణంగా చైనాను వీడుతున్న కంపెనీలను భారత్కు ఆకర్షించేందుకు,ఇక్కడ కొత్త ప్లాంట్ల నిర్మాణానికి భూకేటాయింపులను సులభతరం చేయాలని కూడా మోదీ సర్కార్ ఆలోచిస్తోంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పారిశ్రామిక రంగానికి ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ లభించలేదు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 122 మిలియన్ల మంది తమ ఉద్యోగ,ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఒక పూర్తి ఏడాది పాటు భారత్ ఆర్థిక సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడే దిశగా పయనించడం ఇదే తొలిసారి అని పరిశీలకులు అంటున్నారు. భారీ ఉద్దీపన ప్యాకేజీతోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు.