జియో మరో 9% వాటా విక్రయించే ఛాన్స్, రేసులో అమెరికా కంపెనీ
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి అమెరికాకు చెందిన మరో పెట్టుబడి వచ్చే అవకాశాలున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన టీపీజీ క్యాపిటల్-రిలయన్స్ మధ్య పెట్టుబడుల అంశంపై చర్చలు సాగుతున్నాయట. ఇప్పటికే అమెరికాకు చెందిన కేకేఆర్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటింక్ ఇన్వెస్ట్ చేశాయి.
రూ.1 లక్ష కోట్లకు దగ్గరగా... త్వరలోనే ముఖేష్ అంబానీ టార్గెట్ పూర్తి!
1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి
టీపీజీ క్యాపిటల్ వివిధ పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఉబెర్, ఎయిర్బీఎన్బీ, సర్వేమంకీ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి, 2020) రిలయన్స్ను రుణరహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు ముఖేష్ అంబానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు 9సార్లు (సిల్వర్ లేక్ రెండోసారి పెట్టుబడి పెట్టింది) పెట్టుబడులు పెట్టాయి. టీపీజీ క్యాపిటల్స్ ఇన్వెస్ట్ చేస్తే 10వది అవుతుంది. ఈ సంస్థ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది.
త్వరలో ప్రకటన వచ్చే అవకాశం
ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లో ప్రకటన రావొచ్చునని భావిస్తున్నారు. దీనిపై టీపీజీ క్యాపిటల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించాల్సి ఉంది. జియో ప్లాట్ఫాంలోకి ఇప్పటి వరకు రూ.97,885.65 కోట్లు లేదా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఏడు వారాల్లో 8 కంపెనీలు 21 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫేస్బుక్తో ఈ పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైంది. ఆ తర్వాత సిల్వర్ లేక్ పార్ట్నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల, సిల్వర్ లేక్ (రెండోసారి), ఏడీఏఐలు పెట్టుబడి పెట్టాయి.
రిలయన్స్ మరో 9 శాతం విక్రయించవచ్చు
హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ వంటి రంగాల్లో 2000 సంవత్సరం నుండి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఇండియాలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ ఏఢాది ఫిబ్రవరిలో టీపీజీకి చెందిన టీపీజీ క్యాపిటల్ ఏషియా VII 4.6 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఇదిలా ఉండగా జియో ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే 21 శాతం వాటాను విక్రయించిన రిలయన్స్ మరో 9 శాతం విక్రయిస్తుందని భావిస్తున్నారు.