ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఉందని వరల్డ్ ఇన్-ఇక్వాలిటీ నివేదిక వెల్లడిస్తోంది. 2021 నివేదిక ప్రకారం భారత్లోని కేవలం 1 శాతం మంది దేశ సంపదలో 21.7 శాతం వాటాను కలిగి ఉండగా, ఆర్థికంగా వెనుకబడిన 50 శాతం మంది వద్ద కేవలం 13.1 శాతం సంపద ఉందని ఈ నివేదిక తెలిపింది. అత్యధిక సంపద కలిగిన 10 శాతం మంది దేశంలోని సంపదలో 57 శాతం కలిగి ఉన్నారు. వరల్డ్ ఇన్-ఈక్వాలిటీ ల్యాబ్ కో-డైరెక్టర్ లూకాస్ చాన్సల్ ఈ నివేదికను సిద్ధం చేశారు. పలువురు నిపుణులు ఆయనకు సహకరించారు. సహకరించిన వారిలో ఫ్రెంచ్ ఎకనమిస్ట్ థోమాస్ పికెట్టీ ఉన్నారు. థోమాస్ మాట్లాడుతూ.. భారత్లో ఆర్థిక అసమానత తీవ్రంగా ఉందన్నారు.

ఆదాయ అసమానతలు
భారత్లో ఆదాయపరమైన అసమానతలు పెరిగిపోతున్నాయని ఈ నివేదిక తెలిపింది. 2021 జాతీయ ఆదాయంలో 20 శాతానికి పైగా ఒక శాతం మంది వద్ద, 57 శాతానికి పైగా సంపద 10 శాతం మంది వద్ద ఉన్నట్లు తెలిపింది. భారత్లో వయోజనుల సగటు తలసరి ఆదాయం రూ.2,04,200గా ఉందని వెల్లడించింది. సంపదలో అసమానతలు తీవ్రంగా ఉన్నాయని వెల్లడించింది.
సంపదలో కింద ఉన్న యాభై శాతం మంది వద్ద దాదాపు ఎనిమిదో వంతు సంపద మాత్రమే ఉందని, మధ్యతరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని తెలిపింది. అతి తక్కువ ఆదాయం ఉన్న 50 శాతం మంది ఏడాదికి రూ.53,610 మాత్రమే సంపాదిస్తున్నారని తెలిపింది. మధ్య తరగతి సగటు సంపద రూ.7,23,930గా ఉందని, పది శాతం మంది వద్ద రూ.63,54,070, అత్యంత సంపన్నులైన 1 శాతం మంది వద్ద రూ.3,24,360గా ఉందని తెలిపింది.

1985 నాటి ఆర్థిక విధానాల వల్ల
సంపదలో కింద ఉన్నవారి సగటు ఏడాది సంపద రూ.53,610 అయితే, టాప్ 10 సంపన్నుల ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. భారత్లోని కుటుంబాల సగటు రూ.9,83,010గా ఉంది. 1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక విధానాలు ఆదాయ, సంపద విషయంలో అసమానతలను పెంచాయని నివేదిక తెలిపింది. ముఖ్యంగా పైన ఉన్న 1 శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని తెలిపింది.

లింగ అసమానత
ఆదాయంలోనే కాకుండా లింగ అసమానత కూడా భారత్లో ఎక్కువేనని ఈ నివేదిక తెలిపింది. మొత్తం ఆదాయంలో మహిళా కార్మికుల వాటా కేవలం 18 శాతమే. ఇది ఆసియా సగటు 21 శాతం కంటే తక్కువ. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా దేశాల సగటు మాత్రం 15 శాతంతో భారత్ కంటే తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications