పెద్ద నోట్ల రద్దు: కరెన్సీ దాచుకుంటున్న జనం, డిజిటల్ 'మార్క్'
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేసి నేటికి మూడేళ్లు. నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం వెలికితీతతో పాటు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అనూహ్య ప్రకటన చేశారు. నోట్లు మార్చుకోవడానికి ప్రజలు ఇబ్బందిపడకుండా సమయం ఇచ్చారు. దీంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ భావి భారతం కోసం తీసుకున్న నిర్ణయంగా భావించి చాలామంది ఈ ఇబ్బందులు భరించారు.
నోట్ల రద్దు అనంతరం డిజిటల్ ట్రాన్సాక్షన్ పెద్ద ఎత్తున పెరిగాయి. పేటీఎం, అమెజాన్ పే వంటివి అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. ప్రభుత్వం బీమ్ యాప్ను తీసుకు వచ్చింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ.. నగదు రూపంలో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.
దేవుడే వచ్చి చెప్పినా ఇన్ఫోసిస్ లెక్క అంతే: నందన్ నీలేకని
బ్యాంకుల నుంచి ఇంటి దిశగా పొదుపు
నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2011-12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంది ఉందట. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో నగదు వాటా 2011-12లో 11.4 శాతం కాగా, 2017-18 నాటికి ఏకంగా 25.2 శాతానికి పెరిగింది. డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 శాతం నుంచి 28 శాతానికి పడిపోయింది. చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల వ్యాల్యూలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ వద్ద దాచుకున్న నోట్ల వ్యాల్యూ 2011-12 నుంచి 2015-16 మధ్య 9 నుంచి 12 శాతానికి పెరిగింది. 2017-18లో 26 శాతానికి చేరుకుంది. బ్యాంకుల్లో కంటే ఇంట్లో దాచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
పెరిగిన డిజిటల్ లావాదేవీలు
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటి ఉపయోగం పెరిగింది. మేనేజింగ్ యాప్ వాట్సాప్ కూడా పేమెంట్స్ సేవల్లోకి వస్తోంది. 2016 నుంచి 2018 మధ్య బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన (30 బ్యాంకులు) విలువైన 0.2 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరగగా, 2018లో 74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. POS మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు పెరగగా, మొబైల్ వ్యాలెట్స్ ట్రాన్సాక్షన్స్ 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.
దాదాపు అంతా తిరిగొచ్చిన సొమ్ము
నల్లధనంపై పోరులో భాగంగా మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అక్రమార్కుల వద్ద పెద్ద నోట్లు ఉన్నాయని, వీటి రద్దుతో అక్రమార్కుల వద్ద ఉన్న బ్లాక్ మనీ తిరిగి బ్యాంకులకు రాదని భావించారు. కానీ బ్యాంకు అధికారుల అక్రమాల కారణంగా దాదాపు డబ్బు మొత్తం వెనక్కి వచ్చిందంటారు. రద్దైన నోట్లలో 99.3 శాతం వెనక్కి రావడం గమనార్హం. రద్దు చేసిన పెద్ద నోట్ల వ్యాల్యూ రూ.15.41 లక్షల కోట్లు కాగా, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.15.30 లక్షల కోట్లు వెనక్కి వచ్చంది. కానీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు మాత్రమే తిరిగి వస్తుందని భావించారు.