భయమొద్దు.. 90 రోజుల నుండి ఏడాది ఈ పరిస్థితులైనా తొలగించం: ఉద్యోగులకు కంపెనీల భరోసా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోనున్నారనే వార్తలు అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ప్రభావం భారత్లో తక్కువగానే ఉండనుంది. అమెరికా వంటి అగ్రదేశాల్లోనే ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ఇదే సమయంలో తాము ఇండియాలో 10వేలమంది ఉద్యోగులను నియమించుకుంటామని బిగ్ బాస్కెట్ శుభవార్త తెలిపింది. అంతేకాదు, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగులకు హామీ ఇచ్చాయి.
BigBasket గుడ్న్యూస్: కొద్ది రోజుల్లో 12,000 కొత్త ఉద్యోగాలు
భయం వద్దు.. మీ ఉద్యోగాలకు ఢోకా లేదు
అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఇండియాలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు తమ ఉద్యోగులకు అభయమిచ్చాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో మీ ఉద్యోగాలకు వచ్చిన భయం లేదని స్పష్టం చేశాయి. మూడు నెలల నుండి ఏడాది పాటు ఈ పరిస్థితులు ఉన్నా ఇబ్బంది లేదని ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన ధీమాను కల్పించింది.
ఈ సంస్థలు 90 రోజుల నుండి ఏడాది హామీ
ఈ విపత్కర పరిస్థితులు మూడు నెలలు ఉన్నా భయం అవసరం లేదని కొన్ని కంపెనీలు చెప్పగా, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే ఏడాదిపాటు ఉద్యోగ కోతల జోలికి వెళ్లమని చెప్పాయి. ఎస్ఏపీ, సేల్స్ ఫోర్స్, బూజ్ అల్లెన్ హోమిల్టన్ సంస్థలు 90 రోజులు ఇదే పరిస్థితులు ఉన్నా ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాయి.
34,000 మంది ఉద్యోగులకు జేపీ మోర్గాన్ హామీ
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల తొలగింత లేదా హైరింగ్ తగ్గించడం వంటివి లేవని జేపీ మోర్గాన్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. జేపీ మోర్గాన్కు భారత్లో 34,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో ఈ సంస్థకు ఎక్కువ ఉద్యోగులు ఉన్నది ఇండియాలోనే.
13,000 మంది ఉద్యోగులకు SAP హామీ
90 రోజులు ఇదే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల తొలగింత ఉందని SAP వెల్లడించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు అండగా ఉంటామని తెలిపింది. ఈ కంపెనీకి ఇండియాలో 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
అదే బాటలో ఆల్టో నెట్ వర్క్స్
తమ కంపెనీలో ఉద్యోగాల కోత లేదని పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా అన్నారు. ఈ కంపెనీకి ఇండియా, టెల్ అవిన్, కాలిఫోర్నియాలో 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనాపై పోరుకు తమ సంస్థ 4 మిలియన్ డాలర్లు ఇస్తుందని తెలిపారు.
ఉద్యోగులకు హెల్త్ బెనిఫిట్స్ అందించాలి
గూగుల్, అమెజాన్, వాల్మార్ట్ వంటి దిగ్గజ సంస్థలు కూడా కరోనా వైరస్ లేఆఫ్ లేకుండా చూసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థలు ఇప్పటికే కోతలు ఉండవని ప్రకటన కూడా చేశాయి. నగదు నిల్వల్ని ఉధ్యోగుల కోసం ఉపయోగించుకుంటామని తెలిపాయి. ఈ కంపెనీలు తమ ఉద్యోగులకు 75 శాతం వేతనంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా అందించాలన్నారు.
బూజ్ ఆలెన్ హామిల్టన్.. 27,000 మందికి ప్రత్యేక నిధి
తమ కంపెనీలోని 27,000 మంది ఉద్యోగులకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామని, 100 మిలియన్ డాలర్లు పునరుద్ధరణ ప్రోగ్రాం కింద వారికి కేటాయిస్తామని బూజ్ ఆలెన్ హామిల్టన్ తెలిపింది.
అదనంగా కాగ్నిజెంట్ బోనస్
ఇప్పటికే కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు వన్ టైమ్ క్యాష్ బోనస్ అదనంగా ఇస్తున్నాయి. ప్రతి ఉద్యోగికి రెండు వారాల బోనస్ మొత్తం ఇస్తోంది. ఈ బోనస్ వ్యాల్యూ 80 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
కొత్త ఉద్యోగాలపై భరోసా లేదా?
కొన్ని సంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నా భవిష్యత్తుపై మాత్రం భరోసా ఇవ్వడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల హామీ ఇవ్వలేకపోయినప్పటికీ.. ఉద్యోగులను మాత్రం కాపాడుకుంటామని చెబుతున్నాయి.