ఈ నాలుగు కంపెనీల షేర్లల్లో పెట్టుబడులు పెడితే.. డబ్బులే డబ్బులు
ముంబై: స్టాక్ మార్కెట్.. షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల మీద అవగాహన ఉండే వారికి బంగారు కోడిపెట్ట. షేర్ బజార్లో ఎన్నో కంపెనీలకు సంబంధించిన షేర్లు మంచి రిటర్లను అందిస్తోన్నాయి. షేర్లు కొనాలనే ఆలోచన రాగానే.. రిలయన్స్, టాటా, జీఎంఆర్.. ఇలా బడా కంపెనీల పేర్లు మనకు గుర్తుకొస్తుంటాయి. అదే క్రమంలో బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించిన షేర్లు కూడా మదుపరులకు లాభాలను ఆర్జించిపెట్టేవే. వాటిల్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రారంభంలో పెద్ద మొత్తాలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
చిన్న కంపెనీలతో పెద్ద లాభాలు..
అలాంటి బిగ్ షాట్ కంపెనీలే కాకుండా.. కొన్ని చిన్న తరహా సంస్థలకు సంబంధించిన షేర్లు కూడా ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టేవే. వాటి గురించి సాధారణ ఇన్వెస్టర్లకు తెలిసే సమాచారం కొంతవరకు మాత్రమే ఉంటుంది. పైగా వాటి పేర్లు, పనితీరు గురించి పెద్దగా మనకు తెలియకపోవడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి కొంత వెనుకాడుతుంటాం. పెట్టే పెట్టుబడి ఏదో కాస్త పేరున్న కంపెనీల్లో పెడితే లాభం రాకపోయినప్పటికీ.. నష్టం మాత్రం రాదనే అభిప్రాయం సాధారణంగా నెలకొని ఉంటుంది.
దీర్ఘకాలిక పెట్టబడుల కోసం..
నిజానికి- తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెట్టే చిన్న స్తాయి కంపెనీలకు చెందిన షేర్లు చాలా ఉన్నాయి. చిన్న కంపెనీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయనేది స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిల్లో స్టాక్ మార్కెట్ నిపుణులు ఎంపిక చేసిన ఓ నాలుగు కంపెనీల షేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ నాలుగు కంపెనీల పేర్ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తోన్నారు. రిస్క్ తీసుకున్నప్పటికీ.. దానికి అనుగుణంగా లాభాలు వస్తాయని సూచిస్తోన్నారు.
స్టీల్ స్ట్రిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్..
స్టీల్ స్ట్రిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. నిపుణులు ఎంపిక చేసిన ఈ నాలుగింట్లో మొదటి స్థానంలో ఉందీ కంపెనీ. స్టీల్ స్ట్రిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ లాభాలను చవి చూశారు. మూడు నెలల్లో వారు పెట్టిన పెట్టుబడులపై 635 శాతం రాబడిని పొందారు. ఈ ఏడాది మే 11వ తేదీన స్టీల్ స్ట్రిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్ ధర రూ.4.42 పైసల వద్ద ట్రేడ్ అయింది.
ఇవే షేర్లు శుక్రవారం నాడు అంటే.. ఈ నెల 20వ తేదీ నాటికి 43.90 పైసల వద్ద ట్రేడ్ అయింది. అంటే దాదాపు 40 రూపాయలు అధిక లాభాలను పొందారు ఇన్వెస్టర్లు. ఉదాహరణకు లక్ష రూపాయల మేర పెట్టుబడి పెట్టిన వారికి ఏడున్నర లక్షల రూపాయల రాబడిని ఇచ్చాయి ఈ షేర్లు. కంపెనీ మార్కెట్ క్యాప్ 37 కోట్ల రూపాయలుగా రిజిస్టర్ అయింది.
ఆదిత్య విజన్..
మార్కెట్ నిపుణుల మరో బెస్ట్ ఛాయిస్.. ఆదిత్య విజన్. ఈ కంపెనీ షేర్లు కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడులను డబుల్ చేశాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 920 కోట్ల రూపాయలు. మూడేళ్లుగా ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు సుమారు 1150 శాతం మేర రిటర్నులను అందజేశాయి. 1999లో షేర్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పుడు దీని షేరు ఒక్కింటికి 15 రూపాయల వద్ద అలాట్ అయింది. ఇప్పుడు దీని లాట్ 8000 షేర్ల వద్ద నిలిచింది. అంటే- ఆదిత్య విజన్ షేర్లు కొనాలీ అంటే 8000లకు తగ్గకూడదు.
దీనికోసం లక్షా 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే స్థాయిలో రాబడి ఉంటుందనేది నిపుణుల మాట. ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉన్న దీని షేర్ వాల్యూ 61 లక్షలుగా నమోదైంది. శుక్రవారం నాడు ఆదిత్య విజన్ కంపెనీ షేర్ 690.35 పైసల వద్ద ట్రేడ్ అయింది.
మూడో కంపెనీ.. రాఘవ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్
ఇక మూడో కంపెనీ రాఘవ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ లిమిటెడ్. 2009లో ఈ కంపెనీ ఏర్పాటైంది. మెటల్స్ నాన్ ఫెర్రోస్ సెక్టార్లో ఇది తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 808.49 రూపాయలు. 2009లో రాఘవ ప్రొడక్టివిటీ పబ్లిక్ ఇష్యూను జారీ చేసంది. అప్పట్లో దీని విలువ 39 రూపాయలుగా అలాట్ అయింది.
ప్రస్తుతం అలాట్మెంట్ 3000గా ఉంది. అంటే కనీసం 3000 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస షేర్లు కొనాలంటే లక్షా 17 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుతం దీని షేర్ల విలువ 23 లక్షలుగా రికార్డయింది. ఈ నెల 2వ తేదీ నుంచి అప్పర్ సర్కుట్లోనే కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఈ కంపెనీ షేర్ ట్రేడింగ్ 819.50 పైసల వద్ద ముగిసింది.
శ్రీగణేష్ రెమెడీస్..
నాలుగో కంపెనీ శ్రీ గణేష్ రెమెడీస్. శ్రీ గణేష్ రెమెడీస్ కంపెనీని 1995లో నెలకొల్పారు. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 350 కోట్ల రూపాయలు. లిస్టింగ్ సమయంలో ఇందులో లక్షా ఎనిమిది వేల రూపాయల మేర పెట్టుబడి పెట్టిన మదుపరులకు తొమ్మిది రెట్ల లాభాన్ని ఇస్తోందీ కంపెనీ. అంటే లక్షా ఎనిమిది వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. దాని విలువ ప్రస్తుతం 9 లక్షల 80 వేలకు చేరింది. శుక్రవారం నాడు ఈ కంపెనీ షేర్ విలువ 352 రూపాయల ట్రేడ్ అయింది. ఇప్పటిదాకా 1100 శాతం మేర రిటర్నులను అందించిందీ కంపెనీ.