ఇండియాలో మాల్దీవ్స్ ... ప్రభుత్వ యోచన!
మాల్దీవ్స్.... అందమైన దీవుల సమాహారం. పర్యాటకుల స్వర్గధామం. మన పొరుగునే ఉన్న ఈ చిన్న దేశం పర్యాటకుల ఆకర్షణలో పెద్ద పెద్ద దేశాలను వెన్నక్కి నెట్టేస్తుంది. స్వచ్ఛమైన సముద్రపు నీరు, తెల్లని ఇసుక తెన్నెలు, అందమైన రిసార్టులు, స్నేహపూర్వక స్వాగతం పలికే ప్రజలు. ఈ వాతావరణమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పర్యాటకులను తన వద్దకు రప్పించుకునేలా చేస్తోంది. అందుకే మాల్దీవ్స్ ఒక బ్యూటిఫుల్ టూరిజం డెస్టినేషన్ ఐంది. ఇక్కడికి భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో పర్యటనకు వెళుతుంటారు. వాటర్ స్పోర్ట్స్, వాటర్ విల్లాలు, బీచ్ రిసార్టులు, వాటర్ రిసార్టులు హనీ మూన్ కోసం వెళ్లే జంటలకు ఘన స్వాగతం పలుకుతాయి.
మాల్దీవ్స్ ప్రధాన ఆదాయ వనరు కూడా పర్యాటకమే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న సౌకర్యాలను భారత్ లో కూడా కల్పించి... సరిగ్గా మరో మాల్దీవ్స్ ను ఇండియా లో సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉంది. ఇందుకోసం చక చకా ప్రణాళికలు వేసింది కూడా. నీతి ఆయోగ్ ఇప్పటికే భారత్ లో మాల్దీవ్స్ తరహా ప్రదేశాలను గుర్తించింది. అక్కడ సకల సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రణాళికలు అందించింది. మన దేశంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి పరచాలంటే ఇది తప్పనిసరి అని గుర్తించింది. ప్రతిపాదనలు ఆమోదించిన ప్రభుత్వం ఇక తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకటి రెండేళ్లలోనే భారత్ లో మాల్దీవ్స్ రూపుదిద్దుకొని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది.
ఉన్న కంపెనీలకే దిక్కు లేదు... మరో చైనా కంపెనీ వస్తోందట..
అండమాన్, లక్షద్వీప్ లో ...
మాల్దీవ్స్ కు దాదాపు దగ్గరగా ఉండే వాతావరణం, దీవుల సమాహారం, నీటి సామీప్యత మన దేశంలో రెండు ప్రాంతాల్లో ఉన్నట్లు నీతి ఆయోగ్ గుర్తించింది. ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాలు ఐన అండమాన్, లక్షద్వీప్ ఉన్నాయి. ఇక్కడ మాల్దీవ్స్ లో మల్లే లగ్జరీ వాటర్ రిసార్టులను, వాటర్ విల్లాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అలాగే పర్యాటకులు ఈ ప్రాంతాలకు సులభంగా చేరుకొనేందుకు తగిన మౌలిక వసతులను కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్, సి ప్లేన్, హెలికాప్టర్ సర్వీసులను కల్పించాలని యోచిస్తోంది. ఫ్లోటింగ్ జెట్టి కూడా అందుబాటులో ఉంచాలని వ్యూహరచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా ప్రభుత్వం పిలిచినట్లు సమాచారం.
రూ 1,500 కోట్ల పెట్టుబడి...
ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనిని ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయనున్నారు. తొలుత లక్షద్వీప్ లోని మినికాయ్ ఐలాండ్, సుహేలి ఐలాండ్, కద్మత్ ద్వీపాల్లో 125 గదులతో కూడిన వాటర్ విల్లాస్ నిర్మించనున్నారు. అలాగే అండమాన్ అండ్ నికోబర్ లోని లాంగ్ ఐలాండ్, అవిస్ ఐలాండ్, స్మిత్ ఐలాండ్, షహీద్ ద్వీప్ ప్రాంతాల్లో 460 గదులతో ల్యాండ్ విల్లాస్ కడతారు. దీనికి సంబంధించిన టెండర్లు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయి. నిర్మాణం కూడా ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది. పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టును నిర్మాణ దారుకు 50 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు నిర్వహణ హక్కులను కల్పించనున్నారు. సుమారు 30-40% మేరకు పెట్టుబడి పై లాభం వచ్చేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసారు.
ఏటా లక్ష మంది...
భారత్ నుంచి ఏటా మాల్దీవ్స్ ను సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటోంది. సుమారు లక్ష మంది భారతీయులు ప్రతి ఏటా మాల్దీవ్స్ ను సందర్శిస్తున్నారు. ఇటీవల ప్రముఖ టీవీ యాంకర్, బిగ్ బాస్ 3 రన్నర్ అప్ అయిన శ్రీ ముఖి కూడా మాల్దీవ్స్ లో పర్యటించిన విషయం తెలిసిందే. అందమైన బీచ్ లు, వాటర్ విల్లాలు, ద్వీపాలు, నీటి అడుగు భాగం కనిపించేంత స్వచ్ఛమైన నీరు ఉండే మాల్దీవ్స్ అంటే అందరికి ఇష్టమే. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ దేశానికి అధికంగా వెళతారని సమాచారం. సరదాగా కొన్ని రోజులు సేద తీరేందుకు అందుబాటు ధరలో మాల్దీవ్స్ బెస్ట్ ప్లేస్ అనేది పర్యాటకుల మాట. సుమారు రూ 30,000 నుంచి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అభిరుచిని బట్టి ధరలు, ప్యాకేజీలు మారుతుంటాయి.