మరో ఆసియా అద్భుతం: చైనా కంటే తక్కువ వేతనం.. దూసుకెళ్తున్న ఆ దేశం
చైనా కరోనా మొదట కేసును ప్రకటించిన వెంటనే వియత్నాం అప్రమత్తమైంది. వెంటనే కరోనా సోకిన వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. కరోనా సోకిన వారిని గుర్తించి, వారిని కలిసిన వారిని.. అలా చాలామందికి పరీక్షలు నిర్వహించింది. దీంతో కేవలం 1,124 కేసులతో 35 మరణాలతో 165 స్థానంలో నిలిచింది. మరణాల రేటులో చివరి నాలుగు స్థానాల్లో నిలిచింది.
పది లక్షలమందిలో ఒకరు మాత్రమే మృతి చెందారు. కరోనా కేసులను అదుపులో ఉంచడంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో 2020లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సాయం కోసం 80కి పైగా దేశాలు అంతర్జాతీయ ద్రవ్య నిధికి వెళ్లగా వియత్నాం 3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యం పతనంలో ఉన్నప్పటికీ ఈ దేశం మాత్రం రికార్డ్ వాణిజ్య మిగులుతో ఉంది.
ఆ భారత బ్యాంకుల వరస్ట్ పర్ఫార్మెన్స్, బంగ్లాదేశ్ బ్యాంకులు అదుర్స్!
జపాన్ నుండి వియత్నాం వరకు..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా దేశాలు అద్భుతంగా ముందుకు సాగాయి. ఒక విధంగా మిరాకిల్ అనవచ్చు. మొదట జపాన్, ఆ తర్వాత తైవాన్, దక్షిణ కొరియా, ఇటీవల చైనా ఆర్థికంగా వేగంగా ఎదిగాయి. ఈ దేశాలు సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్గా నిలిచి తమ ముందు నిలిచాయి. పేదరికం నుండి బయటపడ్డాయి. ఇప్పుడు వియత్నం కూడా ప్రస్తుత క్లిష్ట పరిస్థితిని అవకాశంగా మలుచుకొని ఎదుగుతోంది. కరోనా దెబ్బకు అమెరికా సహా అన్ని దేశాలు కకావికలం అవుతుంటే వియత్నాం వృద్ధిలో దూసుకెళ్తోంది.
వియత్నాం సగటు ఆదాయం ఐదు రెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించింది. సూపర్ పవర్ దేశాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆసియా దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, ఎగుమతులపై దృష్టి సారించాయి. 2010లో ప్రపంచ వాణిజ్యం మందగించినప్పటికీ వియత్నాం ఎగుమతులు సంవత్సరానికి 16 శాతం పెరిగాయి. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. గత మూడు దశాబ్దాల్లో వియత్నాం సగటు ఆదాయం ఐదు రెట్లు పెరిగి 3000 డాలర్లకు చేరుకుంది. భారత్ వంటి దేశాలను అధిగమించింది. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భిన్నంగా వియత్నాం ఎగుమతి మౌలిక సదుపాయాల పెట్టుబడితో సోషల్ వెల్ఫేర్లో పెట్టుబడులను సమతౌల్యం చేసింది. వియత్నాంలో పేదరికంలో మగ్గుతున్న వారు చాలా తక్కువ. అలాగే మౌలిక సదుపాయాల కల్పన బాగుంది.
చైనాతో పోలిస్తే వేతనాలు సగం
ఐఎంఎఫ్ ప్రకారం రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్న వారి నిష్పత్తి 60 శాతం నుండి 5 శాతాని కంటే తక్కువకు పడిపోయింది. రోడ్లు, ఓడరేవులు సహా భవన నిర్మాణ ప్రాజెక్టులపై ప్రభుత్వం భారీగా ఖర్చులు చేసింది. ఇది జీడీపీలో 8 శాతం. గత అయిదేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. కరోనా నేపథ్యంలో చాలా పరిశ్రమలు చైనా నుండి తరలి పోయాయి. లేబర్ సహా తక్కువ ఖర్చు కలిగిన వియత్నాం వైపు ఈ పరిశ్రమలు దృష్టి సారించాయి. ఇటీవల వృద్ధి పరంగా వేగంగా పెరుగుదల నమోదయినప్పటికీ, వేతనాలు చైనాతో పోలిస్తే దాదాపు సగం. వియత్నాం స్కూల్స్ పైన భారీగా ఖర్చు చేసింది. అక్కడ చదువుకున్న వర్క్ ఫోర్స్ ఎక్కువ.
వియత్నాం నిలబెట్టుకుంటుందా?
2015లో వియత్నాం ఎగుమతులు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం వాణిజ్య మిగులును కలిగి ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, యూరోపియన్ యూనియన్తో ఇటీవల ఒప్పందం సహా కీలక మైలురాళ్లు. జపాన్, తైవాన్, చైనా వంటి ఆసియా దేశాలు గత కొద్ది దశాబ్దాలుగా ఆర్థికరంగంలో ముందుకు వచ్చి అద్భుతాలు చేశాయి. వియత్నాం కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. ఇది ఇలాగే కొనసాగుతుందా అనేది ప్రశ్న. గత అయిదేళ్లలో ప్రపంచ దేశాల్లో వియత్నాం కంటే ఏ దేశమూ ఎగుమతులను పెంచలేదు.