టెక్ మహీంద్రా అదుర్స్, రూ.30 డివిడెండ్: ఏప్రిల్ నుండి వేతన పెంపు
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. ఈ కాలానికి కంపెనీ రూ.9730 కోట్ల ఆదాయంపై రూ.1,081 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 2.5 శాం మాత్రమే పెరిగింది. నికర లాభం మాత్రం 34.6 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. ఈ కాలంలో కంపెనీ రూ.37,855 కోట్ల ఆదాయంపై రూ.4,428 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 2.7 శాతం, నికర లాభం 9.8 శాతం పెరిగాయి.
నియామకాలు 10 శాతం వరకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(FY22) రెండంకెల వృద్ధిని సాధించాలని టెక్ మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. సమీక్షా త్రైమాసికంలో టెక్ మహీంద్రా మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (టీసీవీ) 1 బిలియన్ డాలర్లుగా నమోదయిందని, సాధారణంగా నమోదయ్యే దాంతో పోలిస్తే ఇది రెట్టింపని టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిపి గుర్నానీ అన్నారు. కొత్త కాంట్రాక్టులు వస్తుండటంతో వచ్చే త్రైమాసికాల్లో నియామకాలను కూడా ఎనిమిది శాతం నుండి పది శాతం పెంచుతామన్నారు. ఏప్రిల్ నుండి వేతనాలను పెంచనున్నట్లు తెలిపింది.
డివిడెండ్ 600 శాతం
2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5 ఫేస్ వ్యాల్యూ గల ఒక్కో షేరుకు ప్రత్యేక డివిడెండ్ రూ.15తో కలుపుకొని మొత్తంగా రూ.30 (600 శాతం) తుది డివిడెండ్ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్స్ చేసింది. 2021 మార్చి చివరి నాటికి కంపెనీలో పని చేస్తోన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,21,054గా ఉంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 847 మంది తక్కువ.
కొనుగోలు
అమెరికాకు చెందిన కన్సల్టింగ్, సాంకేతికత సేవల కంపెనీ ఈవెంటస్ సొల్యూషన్స్ గ్రూప్ను కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్రా వెల్లడించింది. ఈ డీల్ వ్యాల్యూ 44 మిలియన్ డాలర్లతో (రూ.330 కోట్లు)గా తెలుస్తోంది. ఎక్స్పీరియన్స్, కస్టమర్ మేనేజ్మెంట్ విభాగాల్లో కంపెనీ మరింత పట్టుసాధించనున్నట్లు తెలిపింది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ (BPS) విభాగంలో మరింత సమర్థవంత సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం ఎగసి రూ. 970 వద్ద ముగిసింది.