Moonlighting: మూన్లైటర్లకు శుభవార్త.. సైడ్ గిగ్స్కి టెక్ సీఈవో మద్దతు.. ఏమన్నారంటే..
CP Gurnani: మూన్లైటింగ్ టెక్ కంపెనీలపై పడిన పెద్ద పిడుగనే చెప్పాలి. ఇది ఆ రంగంలోని అనేక కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఒక్క అంశం 220 బిలియన్ డాలర్ల భారత ఐటీ పరిశ్రమను రెండుగా విభజించింది.
రెండు దారులు..
మూన్లైటింగ్ రైటే అనే వారు కొందరు ఉండగా, అసలు ఇది నైతికతకు సంబంధించిన అంశం అంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు మాత్రం తటస్తంగా ఉంటూ.. ముందుగా పర్మిషన్ తీసుకోవాలని కొన్ని షరతుల మీద సైడ్ గిగ్ లకు ఓకే చెబుతున్నాయి. కంపెనీల పనితీరు ప్రభావితం అవుతుందనేది చాలా మంది వాదన.
టెక్ మహీంద్రా సీఈవో..
తాజాగా టెక్ మహీంద్రా కూడా మూన్లైటింగ్కు మద్దతునిస్తున్నవారి సరసన చేరింది. ఇంతకు ముందు ఇన్ఫోసిస్ కూడా దీనికి సానుకూలంగా ఉన్నామంటూ వెల్లడించింది. తమది డిజిటల్ కంపెనీ అని.. వారసత్వ కంపెనీ కాదని, అందుకే ఉద్యోగుల సైడ్ హస్ల్స్కు మద్దతుగా నిలుస్తామని టెక్ మహీంద్రా CEO, మేనేజింగ్ డైరెక్టర్ సీపీ గుర్నానీ వెల్లడించారు.
90 దేశాల్లో వ్యాపారం..
కంపెనీకి సంబంధించి పలు విషయాలపై మాట్లాడిన గున్నాని.. టెక్ మహీంద్రా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90కి పైగా దేశాల్లో వ్యాపారం చేస్తోంది. అయితే ఈ క్రమంలో అక్కడి స్థానిక చట్టాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తోందన్నారు.
ముందుకు రావాలి..
తమ కంపెనీలో పనిచేస్తూ.. వేరే కంపెనీలో కూడా ఏకకాలంలో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బంది ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని గున్నానీ అన్నారు. విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ యుగంలో నిర్మాణాత్మక కొత్త యుగం ఒప్పందాలు అవసరమని చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల మంది ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఏదైనా దీనిని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే కూడా చర్యలు తీసుకోవచ్చని అన్నారు.
కాదంటున్న కంపెనీలు..
ఎవరు ఏమనుకున్నా తాము మాత్రం మూన్లైటింగ్ అంగీకరించేది లేదని విప్రో, TCS, IBM వంటి కంపెనీలు తేల్చి చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను సైతం సైలెంట్ గా తొలగిస్తున్నాయి. ఎవరైనా ఉద్యోగి ఉత్పాదకంగా ఉంటే తాను సంతోషిస్తానని టెక్ మహీంద్రా సీఈవో అంటున్నారు. కానీ ఏం చేసినా కంపెనీకి తెలపాలని మాత్రం గున్నాని స్పష్టం చేశారు.