Tech Mahindra: తగ్గిన టెక్ మహీంద్రా లాభాలు.. ఇన్వెస్టర్లకు డివిడెండ్.. పూర్తి వివరాలు
Tech Mahindra: అన్ని కంపెనీలు సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఐటీ మేజర్ టెక్ మహీంద్రా సైతం తన Q2 ఫలితాలను వెలువరించింది. అయితే ఈ కంపెనీ విషయంలో విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి.
మందగమనం..
దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు సైతం ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు వ్యాపారం క్షీణించటంతో పాటు అనేక ఇతర కారణాలు, పెరుగుతున్న ఖర్చులు ఉన్నాయని టెక్ రంగంలోని వర్గాలు చెబుతున్నాయి. దీనిని అదిగమించేందుకు కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషించటం ఇప్పటికే మెుదలు పెట్టాయి.
అంచనాలు మిస్..
టెక్ మహీంద్రా సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,285 ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 4% తక్కువ. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 13.6% పెరిగింది. కంపెనీ వ్యాపార ఆదాయం రూ.13,129.5 కోట్లకు చేరుకుంది. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 20.6% పెరిగింది.
నిర్వహణ లాభం రూ.1,984 కోట్లుగా ఉంది. దీంతో కంపెనీ ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్ ప్రకటించింది.
యూరోపియన్ మార్కెట్..
దేశంలో ఐదవ అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న టెక్ మహీంద్రా.. టాలెంట్, రీసెర్చ్ పై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ప్రభావితం చేశాయని వెల్లడైంది. దీనికి తోడు కరెన్సీ మారక విలువల్లో ఒడిదొడుకులు, వ్యాపారానికి కీలకమైన యూరోపియన్ మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోవటం వల్ల లాభదాయకత దెబ్బతిందని తెలుస్తోంది. యూరోపియన్ కరెన్సీ పనితీరు దారుణంగా ఉండటం ద్రవ్యోల్బణ సమయంలో కంపెనీ ఖర్చుల పెరుగుదలకు కారణంగా ఉంది.
అట్రిషన్ రేటు ఇలా..
ఐటీ సేవల రంగంలోని చాలా కంపెనీలు అధిక అట్రిషన్ రేటుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఉద్యోగుల వలసల విషయంలో టెక్ మహీంద్రాకు మాత్రం స్వల్ప ఊరట లభించింది. గడిచిన త్రైమాసికంలో అట్రిషన్ రేటు 20 శాతంగా నమోదైంది. అంతకు ముందు క్వార్టర్ లో ఇది 22 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో సంస్థ నికరంగా 5,877 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.63 లక్షలకు చేరుకుంది. ఈరోజు ఉదయం 9.40 గంటలకు టెక్ మహీంద్రా స్టాక్ రూ.1,089 వద్ద ట్రేడ్ అవుతోంది.