TCS Q4 results: టీసీఎస్ ఫలితాలు అదుర్స్, 15% పెరిగిన నెట్ ప్రాఫిట్
ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫలితాలు అదరగొట్టాయి. ఈ దేశీయ ఐటీ దిగ్గజం ఈ రోజు (ఏప్రిల్ 12, సోమవారం) 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికిగాను ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన లాభం 14.9శాతం వృద్ధిని నమోదు చేసి రూ.9,246 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.8,049 కోట్ల లాభం ఆర్జించింది. కంపెనీ రెవెన్యూ 9.4 శాతం పెరిగి రూ.43,705 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.39,946 కోట్లుగా ఉంది. త్రైమాసికం పరంగా కాన్స్టాంట్ కరెన్సీ గ్రోత్ 4.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన ఇది 5.9 శాతంగా ఉంది.
డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ ప్రాఫిట్ రూ.8,701 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.42015 కోట్లుగా ఉంది. ప్రతి ఈక్విటీ షేర్కు రూ.15 డివిడెండ్ ప్రకటించింది కంపెనీ. ఈసారి ఉద్యోగుల సంఖ్య 19,388 పెరిగింది. ఓ త్రైమాసికంలో ఇదే అత్యధికం. టీసీఎస్కు అత్యధిక ఆదాయం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్(BFSI) నుండి వచ్చాయి. ఇలా వచ్చిన మత్తం రూ.17,559 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. గత ఏడాది రూ.15,207 కోట్లుగా ఉంది.
నాలుగో త్రైమాసికం ఆర్డర్ బుక్ 9.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

కాగా, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సమీర్ సేక్సారియా మే 1వ తేదీ నుండి బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చింది. కంపెనీ నుండి రామకృష్ణన్ రిటైర్ అవుతున్నారు. ఆయన ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ అవుతున్నారు. సోమవారం టీసీఎస్ స్టాక్స్ 2.43 శాతం క్షీణించి రూ.3,241 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications