టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలకు అలా మంచి ఛాన్స్!
కరోనా మహమ్మారి ప్రభావం ఐటీ రంగంపై భారీగానే పడింది. అయితే ముందు ముందు ఐటీ సేవల రంగానికి బావుంటుందని దిగ్గజ సంస్థలు గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశాయి. వైరస్ తదనంతర పరిణామాలతో క్లయింట్స్ ఐటీ ఖర్చులు పెరుగుతున్నాయని, ఇది టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలకు ప్రయోజనకరం కావొచ్చునని భావిస్తున్నారు. ఈ మేరకు కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.
ఐటీ కంపెనీలకు చిక్కులు, ఖాళీగా ఉద్యోగులు! లాభాలపై ప్రభావం
ఔట్ సోర్సింగ్లో భారీ పెరుగుదల
ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలు 6 శాతం నుండి 8 శాతం మేర పెరగవచ్చునని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. వివిధ కంపెనీలు కొత్త వ్యాపారాలకు వెళ్లడం, వినూత్న సామర్థ్యాల కోసం ఖర్చులు పెరిగినట్లు గుర్తించాయని ఈ నివేదిక తెలిపింది. గార్ట్నర్ ప్రకారం 2021-22 వరకు ఐటీ సేవలు 6 శాతం నుండి 8 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గత పదేళ్లలో ఈ పెరుగుదల కేవలం 4 శాతం నుండి 5 శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కన ఐటీ కంపెనీలకు డిమాండ్ పెరగనుంది.
ఈ నాలుగు కంపెనీలకు మంచి ఛాన్స్
ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ కంపెనీలు ముందు ఉండనున్నాయి. ఔట్ సోర్సింగ్ ఇచ్చే కంపెనీలు ఆయా కంపెనీల సామర్థ్యం, ప్రాసెసింగ్ సామర్థ్యం సహా అన్నింటిని పరిగణలోకి తీసుకుంటాయి. టీసీఎస్, విప్రో తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రోలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయని చెబుతున్నారు.
క్లౌడ్ సేవలు..
ఐటీ కంపెనీలు తమ కస్టమర్లకు డిజిటల్ పరివర్తనతో సేవలు అందించేందుకు గూగుల్ క్లౌడ్, అజుర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సాస్ ప్రొవైడర్స్ వంటి క్లౌడ్ హైపర్ స్కాలర్లతో చేతులు కలిపాయి. ప్రస్తుత కరోనా సమయంలోను క్లయింట్స్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది ఉపయోగపడుతోంది. క్లయింట్స్ వేగంగా క్లౌడ్ దిశగా అడుగులు వేసినప్పటికీ ఆ మేరకు మాత్రం ఐటీ కంపెనీలు ప్రయోజనం పొందకపోవచ్చునని అంటున్నారు. క్లౌడ్ సేవల వృద్ధి 20 శాతం నుండి 33 శాతం వరకు ఉన్నప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ల వృద్ధి ఆ మేరకు ఉండకపోవచ్చునని అంటున్నారు. కరోనా సమయంలో ఆఫ్ లైన్ షాప్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో రిటైల్ క్లయింట్స్ ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో పెట్టుబడులు పెట్టారు.