వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్: క్రమంగా కార్యాలయాలకు ఐటీ ఉద్యోగులు
ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కు క్రమంగా షిఫ్ట్ చేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో క్రమంగా ఉద్యోగుల సందడి మొదలవుతోంది. అయితే ఇది పాక్షికమే. వర్క్ ఫ్రమ్ ఆఫీస్తో పాటు ఐటీ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లకు పైగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. కరోనా ముప్పు తగ్గిపోవడంతో ఇప్పుడు గతంలో మాదిరి కార్యాలయాల నుండి పనికి సిద్ధమయ్యారు.
బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో వివిధ రంగాల్లోని కంపెనీలు.. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్లకు పిలిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతూ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఆఫీస్ల నుండి పని చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చునని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు అనుసరించే అవకాశముంది. వారంలో కొన్ని రోజులు ఇంటి నుండి, కొన్ని రోజులు ఆఫీస్ నుండి పని చేయించే విధానంపై దృష్టి సారించాయి. హైదరాబాద్లో లక్షలమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలామంది ఉద్యోగులు ఇప్పటికే తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లారు. కంపెనీలు వెనక్కి పిలుస్తుండటంతో చాలామంది హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలి వస్తున్నారు.
టీసీఎస్, హెచ్సీఎల్ హైబ్రిడ్ విధానం వైపు మొగ్గు చూపుతోంది. ఇన్ఫోసిస్ దశలవారీగా ఉద్యోగులను ఆఫీస్కు పిలిపించే ప్లాన్ చేస్తోంది. కాగ్నిజెంట్, విప్రో వంటి సంస్థలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉద్యోగుల సంఖ్య రానున్న రెండే నెలల కాలంలో 25 శాతానికి, ఆగస్ట్ నాటికి 50 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు.