TCS: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్.. 100 శాతం ఆ సొమ్ము చెల్లిస్తామంటూ ప్రకటన
TCS News: ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న 6 లక్షలకు పైగా టెక్కీలకు వేరియబుల్ పరిహారాన్ని 100% చెల్లిస్తామని పేర్కొంది.
డబ్బులు ఎప్పుడొస్తాయంటే..
టాటా గ్రూప్ కంపెనీ C3A, C3B, C4, సమానమైన గ్రేడ్ల కోసం వేరియబుల్ చెల్లింపును ఒక నెల ఆలస్యం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే జూలైలో చెల్లించాల్సిన ఈ వేరియబుల్ సొమ్మును ఆగస్ట్-చివరి నాటికి చెల్లించటం జరుగుతుందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. అసిస్టెంట్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ స్థాయి ఉద్యోగులకు దీనికి సంబంధించి కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఈ వివరాలు తెలిపినట్లు సమాచారం.
70 శాతానికి తగ్గింపు..
దేశంలోని WIPRO, INFOSYS వంటి ఇతర IT కంపెనీలు వేరియబుల్ వేతనాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు తెలిపింది. ముఖ్యంగా కార్యకలాపాల మార్జిన్లో క్షీణత కనిపించిన తర్వాత విప్రో తన ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటన చేసింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేరియబుల్ పేలో సగటున 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతికతలో పెట్టుబడులు, ఉద్యోగుల కొరత, మార్జిన్ ఒత్తిడి వంటి కారణాల వల్ల విప్రో ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని ఆలస్యం చేసింది.
వేరియబుల్ పే అంటే ఏమిటి?
వేరియబుల్ పే అనేది పనితీరు, సంస్థ పెరుగుదల పురోగతికి సహకారం ఆధారంగా ఉద్యోగులకు యజమాని చెల్లించే పరిహారం. ఇది ఉద్యోగులకు మూడునెలలకు ఒకసారి కంపెనీలు చెల్లిస్తుంటాయి. ఉద్యోగులు జీతంలో ఇవి కూడా ప్రధాన భాగంగా ఉంటాయి.