పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట: అనూహ్యం.. కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభించారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలను చదవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 9.27 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీన్ని అందుకుంటామనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పలు పథకాలను ప్రకటించారు. మౌలిక రంగానికి పెద్ద పీట వేశామని అన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటను ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ట్యాక్స్పేయర్లకు ఊపిరి పీల్చుకునే వెసలుబాటును ఇచ్చారు. ఇ-ఫైలింగ్ పోర్టల్లో నెలకొన్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ తాజా ప్రకటన చేశారు. ఎర్రర్లు, సాంకేతిక లోపాల వల్ల కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులు పడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటోన్నందున వారికి ఊరట కల్పించే ప్రకటన చేశారు.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్నుల రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును పొడిగించారు. ఐటీ రిటర్నులను దాఖలు చేసే అవకాశాన్ని రెండు సంవత్సరాల వరకు పొడిగించినట్లు తెలిపారు. అంటే- సంబంధిత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేయాల్సిన ఇన్కమ్ట్యాక్స్ రిటర్నులను రెండు సంవత్సరాల్లోపు దాఖలు చేసుకునే వీలును కల్పించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. రెండు సంవత్సరాల లోపు ఐటీ రిటర్నులను దాఖలు చేయవచ్చని, వాటిని పోర్టల్లో అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రస్తుతం డిసెంబర్ 31వ తేదీ వరకు ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- దీన్ని ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు మళ్లీ పొడిగించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా రూపొందించిన ఇ-ఫైలింగ్ పోర్టల్లో అనేక సమస్యలు తలెత్తడం వల్ల కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీగా జరిమానాలను చెల్లించారు.
గడువులోగా ఐటీ రిటర్నులను దాఖలు చేసినప్పటికీ- పోర్టల్లో నెలకొన్న సమస్యల వల్లే జరిమానాను చెల్లించాల్సి వచ్చిందని ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం పన్ను చెల్లింపుదారుల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మళ్లీ వారికే తిరిగి చెల్లించింది. కొన్ని నెలలుగా ఇదొక నిరంతర ప్రక్రియగా మారింది. ఆర్థికశాఖ అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ విషయంలో. అందుకే- ఐటీ రిటర్నులను దాఖలు చేసుకోవడానికి ఏకంగా రెండు సంవత్సరాల పాటు వెసలుబాటును ఇచ్చింది కేంద్రం.