Tata Motors: ఆ సెక్టార్ వాహనాల ధరలు భగ్గు..అక్టోబర్ నుంచే
ముంబై: దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వాటి ధరలకు రెక్కలు రానున్నాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. సెప్టెంబర్లోనే దీనికి ముహూర్తం పడింది. దేశంలో అత్యధికంగా విక్రయమయ్య కార్ల తయారీ కంపెనీగా పేరున్న మారుతి సుజుకి ఇప్పటికే తన వాహన ధరలను పెంచగా.. ఇక టాటా మోటార్స్ అదే బాటలో సాగనుంది.
టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరగనున్నాయ్. అక్టోబర్ 1వ తేదీ నుంచి కమర్షియల్ వాహనాల రేట్లను పెంచనున్నట్లు టాటా మోటార్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని కమర్షియల్ వాహనాల రేట్లు పెంచాలని ప్రతిపాదించినట్లు టాటా మోటార్స్ యాజమాన్యం తెలిపింది. వాహనాల తయారీలో వినియోగించే పరికరాల, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల కమర్షియల్ వాహనాల రేట్లను పెంచాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడుతోందని స్పష్టం చేసింది.
ఈ భారాన్ని కొంతమేరకైనా పంచుకోవాలనే ఉద్దేశంతోనే కమర్షియల్ వాహన ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. అన్ని రకాలకు చెందిన కమర్షియల్ వాహనాల ధరలో కనీసం రెండుశాతం మేర పెరుగుదల చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాహనాల రేట్లను పెంచడం ఇది రెండోసారి. ఇదివరకు ఆగస్టులో స్వల్పంగా వాటి రేట్లను పెంచింది టాటా మోటార్స్. ఇప్పుడు మళ్లీ తాజాగా అక్టోబర్ 1 నుంచి వాటి రేట్లను సవరించనుంది.
విడిభాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల ఆటోమొబైల్ సెక్టార్ తీవ్ర ఇక్కట్లకు గురవుతోందనే విషయం తెలిసిందే. కిందటి నెలలోనే మారుతి సుజుకి తన వాహనాల రేట్లను పెంచింది. భారీగా నెట్ ప్రాఫిట్ను చవి చూసిన తరువాత కూడా మారుతి సుజుకి ధరల పెంచడానికి పూనుకుంది కిందటి నెల. జూన్ 30వ తేదీ నాటికి ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆశించిన మేర నెట్ ప్రాఫిట్ను అందుకుంది మారుతి సుజుకి. 475 కోట్ల రూపాయల మేర నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది.
గత ఏడాదితో పోల్చితే- నెట్ ప్రాఫిట్ అసాధారణంగా పెరిగినట్టే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి త్రైమాసిక కాలానికి 268.30 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మారుతి సుజుకి చవి చూసింది. టాటా మోటార్స్ మాత్రం నష్టాలను చవి చూసింది. తొలి త్రైమాసికంలో 4,451 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చిందా కంపెనీకి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసిక కాలానికి 8,438 కోట్ల రూపాయల మేర నష్టం రాగా.. అది సగానికి తగ్గింది గానీ నెట్ ప్రాఫిట్లోకి రాలేకపోయింది. దీనికితోడు విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో- వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.