Tata motors: టాటా మోటార్స్ షేర్లు డీ లిస్టింగ్.. మార్కెట్ వర్గాల్లో ఆందోళన.. ఇంతకీ ఏమైంది ?
Tata motors: దేశీయంగా అత్యంత విశ్వసనీయ సంస్థల్లో ఒకటి టాటా గ్రూపు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా టాటా గ్రూపుతో అంటే మరో ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనేది సగటు భారతీయుడి భావన. అంతటి ప్రఖ్యాత సంస్థకు చెందిన టాటా మోటార్స్ షేర్లు.. ఎక్స్ఛేంజ్ నుంచి డీ లిస్ట్ అయ్యాయనే వార్త మార్కెట్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఇది జరిగింది ఇండియన్ మార్కెట్లలో కాదని తెలిసిన తర్వాతే పెట్టుబడిదారులకు ఉపశమనం లభించింది.
స్వచ్ఛందంగా డీ లిస్ట్:
టాటా గ్రూపుకు చెందిన దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ షేర్లను న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE) నుంచి స్వచ్ఛందంగా డీ లిస్ట్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అంటే ఈ కంపెనీకి సంబంధించిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోయాయని అర్థం. తద్వారా ఇప్పటికే షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ఎక్స్ఛేంజ్ వద్ద విక్రయించే అవకాశం ఉంటుంది కానీ కొత్తగా కొనే సౌలభ్యం ఉండదు.
ఇక్కడ సాధారణమే..
భారత్ లోని BSE, NSE లో తమ ఈక్విటీ షేర్ల ట్రేడింగ్ కు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా ఈ షేరు ధర మంగళవారం 3 శాతానికి పెరిగి.. 420 వద్ద ట్రేడ్ అయింది. సంస్థ మార్కెట్ క్యాప్ లక్షా 40 వేల కోట్లకు పైగా ఉంది.
ఎందుకీ డీ లిస్టింగ్:
కంపెనీ అమెరికన్ డిపాజిటరీ రసీదులను (ADS) US మార్కెట్లో ట్రేడ్ చేయడంపై భారత ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడి.. ఈ చర్యలు తీసుకున్నట్లు టాటా మోటార్స్ రెగ్యులేటరీ నోటీసులో పేర్కొంది. ఏడీఎస్ హోల్డర్లు తమ షేర్లను న్యూయార్క్ ఎక్స్ఛేంజ్లోని డిపాజిటరీలో డిపాజిట్ చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 24 లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది. అనంతరం మిగిలిన ఈక్విటీ షేర్లను విక్రయించవచ్చని తెలిపింది.