MK Stalin..గ్రేట్ డెసిషన్: తమిళనాడులో పెట్రోల్ ఇక చీప్
చెన్నై: దేశంలో ఇంధన ధరలు ఏ రేంజ్లో పెరుగుతూ వచ్చాయో చూశాం. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికి అంటుతూ వచ్చాయి. చమురు సంస్థల వరుస బాదుడుతో వాటి రేట్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపించాయి. వాహనాలను రోడ్డు మీదికి తీసుకుని రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాయి. రెండు నెలలుగా క్రమం తప్పకుండా చమురు సంస్థలు మోపుతూ వచ్చిన ధరల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు.. సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అసలు ఏ మాత్రం ఊహించని విధంగా దూసుకెళ్లాయి.
100 రూపాయలకు పైగా..
పెట్రోల్, డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి 110 రూపాయలను టచ్ చేసే పరిస్థితి ఇవ్వాళ దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ.. చమురు సంస్థలు మాత్రం కనికరం లేకుండా వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తూ వచ్చాయి. చివరికి డీజిల్ రేటు కూడా లీటర్కు 100 రూపాయల ల్యాండ్ మార్క్ను దాటేసింది. నిత్యం పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు చేశారు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గానీ, చమురు సంస్థలు గానీ దిగి రాలేదు. కొద్దిరోజులుగా ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకోవట్లేదు. చమురు సంస్థలు వాటి రేట్లను పెంచట్లేదు.
పొరుగు రాష్ట్రాలు అనుసరిస్తాయా?
దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ 108 నుంచి 110 రూపాయల వరకు పలుకుతోంది. ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాహనదారులకు ఊరట కల్పించే నిర్ణయం అది. సరిహద్దు గ్రామాలు, పట్టణాలకు చెందిన వాహనదారులు తమిళనాడుకు పోటెత్తడానికి దారి తీసే చర్యలను తమిళనాడు ప్రభుత్వం తీసుకుంది. ఇక పొరుగు రాష్ట్రాలు కూడా తమిళనాడును అనుసరించేలా ఒత్తిళ్లలోకి నెట్టే చర్య అది.
పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు..
పెట్రోల్పై విధించిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. పెట్రోల్పై వసూలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీలో మూడు రూపాయలను తగ్గించనున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీ త్యాగరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ ఉదయం ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో పెట్రోల్పై మూడు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించనున్నట్లు తెలిపారు.
సుంకాల విధింపు.. రాష్ట్రాల చేతుల్లో..
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సుంకాలను వసూలు చేస్తుంటాయనే విషయం తెలిసిందే. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా సుంకాలను వసూలు చేస్తోంటాయి. రాష్ట్ర ఆర్థిక అవసరాలను ఆధారంగా చేసుకుని.. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ వంటివి విధిస్తుంటాయి. ఆ సుంకాల మొత్తాన్ని పెంచడమా? తగ్గించడమా? అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠస్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కొంతమేరకైనా వాహనదారులకు ఊరట కలిపించాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా పెట్రోల్పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీలో మూడు రూపాయలను తగ్గించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది.
1,160 కోట్లు నష్టం..
పెట్రోల్పై మూడు రూపాయల ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల ఖజానా వచ్చే రోజువారీ రాబడి తగ్గడం ఖాయం. ప్రతి సంవత్సరం కూడా 1,160 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది తమిళనాడు ప్రభుత్వం. అయినప్పటికీ- పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వాహనదారులపై పడుతోన్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆర్థిక మంత్రి పీ త్యాగరాజన్ తెలిపారు. పెరిగిన పెట్రోల్ ధరలు.. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద ప్రజల నడ్డి విరుస్తోన్నాయని, దీని నుంచి కొంతమేరకైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్లు చెప్పారు.