స్విగ్గి చేతికి మరో రూ 800 కోట్ల నిధులు... ఏం చేస్తుందో తెలుసా?
ఆన్లైన్ ఫుడ్ ఆర్దరింగ్ కంపెనీ స్విగ్గి... నిధుల వేటలో దూసుకుపోతోంది. ప్రతి సిరీస్ లో రూ వందల కోట్లలో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తూ పోటీదారులకు చుక్కలు చూపుతోంది. కేవలం ఫుడ్ డెలివరీ కి మాత్రమే పరిమితం కాకుండా, గ్రోసరీస్ డెలివరీ సహా వినియోగదారుల డెలివరీ సేవలు కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్విగ్గి మరో రూ 805 కోట్ల నిధులను (113 మిలియన్ డాలర్లు ) సమీకరించింది. నాస్పెర్స్, మేటువాన్, వెల్లింగ్టన్ మేనేజ్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ నిధుల్ని అందించాయి. సిరీస్ ఐ లో భాగంగా స్విగ్గి ఈ మేరకు నిధుల్ని సమీకరించినట్లు ప్రముఖ స్టార్టుప్ ట్రాకర్ ఇంట్రాకర్ ఒక కథనంలో వెల్లడించింది. ఇప్పటికే స్విగ్గి లో పెద్ద ఇన్వెస్టర్ గా ఉన్న సౌత్ ఆఫ్రికా కు చెందిన పెట్టుబడి సంస్థ నాస్పెర్స్ ఏకంగా రూ 712 కోట్ల నిధుల్ని స్విగ్గి కి అందించింది. మిగితా నిధులను ఇతర సంస్థలు సమకూర్చాయి. ఈ డీల్ లో భాగంగా నాస్పెర్స్ కు 30,170 షేర్లను స్విగ్గి కేటాయించగా, వెల్లింగ్టన్ మేనేజ్మెంట్ కు 302 షేర్లు, మేటువాన్ కు 3,606 షేర్లను స్విగ్గి కేటాయించింది. అదే సమయంలో ఇండియాలో స్విగ్గి తో పోటీ పడుతోన్న జొమాటో నిధుల సమీకరణలో కొంత వెనుకబడుతోందని తెలుస్తోంది.
నాస్పెర్స్ చేతికి 40% వాటా...
పేరుకే స్విగ్గి ఇండియన్ కంపెనీ కానీ... ఇప్పుడు అది ఒక ఫారిన్ కంపెనీ యజమాన్యంలోకి వెళ్ళినట్లే. బెంగళూరు కేంద్రంగా తన కార్యకలాపాలు సాగించే స్విగ్గి ని మన తెలుగు తేజం శ్రీ హర్ష మాజేటి ముందుండి నడిపిస్తున్నారు. కానీ మొదటి నుంచి స్విగ్గి లో దక్షిణాఫ్రికా కు చెందిన నాస్పెర్స్ అనే పెట్టుబడి సంస్థ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా చేసిన ఇన్వెస్ట్మెంట్ తో ప్రస్తుతం స్విగ్గిలో నాస్పెర్స్ వాటా 40.56% నికి పెరిగిపోయింది. ఈ కంపెనీ లో అతిపెద్ద వాటాదారుగా నాస్పెర్స్ అవతరించింది. అదే సమయంలో మేటువాన్ వాటా 6.35% నికి చేరుకోగా.. వెల్లింగ్టన్ మేనేజ్మెంట్ కు 1% మేరకు వాటా సొంతమైంది. డిసెంబర్ 2018 లో స్విగ్గి సమీకరించిన 1 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత ప్రస్తుత సిరీస్ ఐ ఇన్వెస్ట్మెంట్ కీలకమైనదని భావిస్తున్నారు. స్విగ్గి మరిన్ని నిధులు సమీకరించే పనిలో పడ్డట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
3.5 బిలియన్ డాలర్లకు వాల్యుయేషన్...
ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ తో స్విగ్గి మార్కెట్ వాటా గణనీయంగా పెరిగిపోయింది. భారత దేశంలో ఏర్పాటైన స్టార్టుప్ కంపెనీల్లో యునికార్న్ స్థాయికి చేరుకున్న తొలి పది కంపెనీల్లో స్విగ్గి కూడా ఒకటి. కాగా, ఇప్పుడు స్విగ్గి విలువ ఏకంగా 3.5 బిలియన్ డాలర్ల కు (సుమారు రూ 24,500 కోట్లు) చేరుకుంది. మరోవైపు స్విగ్గి పోటీ దారు జొమాటో ఒక వైపు నిధుల సమీకరణలో వెనుకపడిపోతుండగా... ఇటీవల అది 350 మిలియన్ డాలర్లకు ఉబెర్ ఈట్స్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలే ఇండియన్ ఆన్లైన్ ఫుడ్ ఆర్దరింగ్ విభాగాన్ని శాసిస్తున్నాయి.
నెలకు 4 కోట్ల ఆర్డర్లు...
స్విగ్గి, జొమాటో కంపెనీలు ఫుడ్ డెలివరీ లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే దేశంలో సుమారు 500 నగరాలూ, పట్టణాలకు సేవలను విస్తరించి కోట్లలో వినియోగదారులకు నిత్యం ఆహారాన్ని డెలివరీ చేస్తున్నాయి. ప్రస్తుతం స్విగ్గి నెలకు సుమారు 4.5 కోట్ల ఆర్డర్లు ప్రాసెస్ చేస్తుండగా... జొమాటో ఆర్డర్లు సుమారు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంటున్నాయి. అయితే, ఈ రంగంలో ఒకప్పటిలా ఇప్పుడు వృద్ధి ఉండటం లేదు. దీన్ని తట్టుకుని నిలబడాలంటే విభిన్న రంగాల్లోకి విస్తరించాల్సి ఉంటుంది. మరోవైపు అమెజాన్ కూడా ఫుడ్ డెలివరీ లోకి ప్రవేశించే అవకాశాలు ఉండటంతో ఈ రంగం మరింత తీవ్రమైన పోటీని ఎదుర్కొనబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.