అమెజాన్ పిటిషన్పై ఫ్యూచర్ గ్రూప్కు సుప్రీంకోర్టు నోటీసులు; ఫిబ్రవరి 23న విచారణ
రిలయన్స్తో ఫ్యూచర్ రిటైల్ యొక్క 24,500 కోట్ల రూపాయల విలీన ఒప్పందంపై మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ముందు కొనసాగుతున్న మధ్యవర్తిత్వ విచారణపై ఢిల్లీ హైకోర్టు జనవరి 5న స్టే విధించినందుకు వ్యతిరేకంగా అమెజాన్ చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం ఫ్యూచర్ గ్రూప్ నుండి ప్రతిస్పందనను కోరింది. నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని కోరింది.
ఫ్యూచర్ గ్రూప్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం
ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సిపిఎల్), ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) లకు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23న దీనిపై విచారణ జరుపుతామని కేసును వాయిదా వేసింది. జనవరి 5 నాటి హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్పై అమెజాన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం వాదనను ప్రారంభించకముందే బెంచ్ అమెజాన్ విజ్ఞప్తిపై నోటీసు జారీ చేసింది.
అమెజాన్ వర్సెస్ ఫ్యూచర్ గ్రూప్ .. మధ్యవర్తిత్వంపై ఢిల్లీ హైకోర్టు స్టే
2020 ఆగస్టులో తమ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూపు ఒప్పందం చేసుకుంది. రిలయన్స్తో 24,500 కోట్ల రూపాయల డీల్పై అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఒప్పందాల ప్రకారం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాలను తమకే అమ్మాలని వాదించింది. రిలయన్స్ తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందం తమ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని అప్పటినుండి అమెజాన్ దీనిపై పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్లో జరుగుతున్న అమెజాన్-ఫ్యూచర్ మధ్యవర్తిత్వంపై ఢిల్లీ హైకోర్టు జనవరి 5న స్టే విధించింది.
స్టే ను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన అమెజాన్
ఈ స్టే పై అమెజాన్ సుప్రీం కోర్టు మెట్లెక్కింది. తాజాగా ఈ కేసులో సుప్రీం ధర్మాసనం ఫ్యూచర్ గ్రూప్ కు నోటీసులు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తరపున హాజరయ్యే సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కూడా అందుబాటులో లేనందున ఈ అంశాన్ని ఫిబ్రవరి 23న విచారణ జరుపుతామని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందంపై తన అనుమతిని రద్దు చేసిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆర్డర్పై అమెజాన్ పిటిషన్ను ఎన్సిఎల్ఎటి వచ్చే వారం విచారిస్తుందని రోహత్గీ చెప్పారు.
న్యాయ వివాదంలో అమెజాన్, ఫ్యూచర్ గ్రూపులు
రిలయన్స్తో విలీన ఒప్పందాన్ని కొనసాగించకుండా ఎఫ్ఆర్ఎల్ను అడ్డుకున్న తుది మధ్యవర్తిత్వ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంపై ఎఫ్ఆర్ఎల్ మరియు ఇతరుల బ్యాచ్ పిటీషన్లను మార్చి మూడవ వారంలో విచారించాలని హైకోర్టు నిర్ణయించిందని కూడా ఆయన చెప్పారు. యూఎస్ కు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లో అక్టోబర్ 2020లో మధ్యవర్తిత్వానికి లాగిన తర్వాత అమెజాన్ మరియు ఫ్యూచర్ గ్రూప్ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాయి. అప్పటినుండి ఒక దానిపై ఒకటి న్యాయ పోరాటం చేస్తున్నాయి.