Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
Stock Market: రానున్న వారం స్టాక్ మార్కెట్లకు మాత్రమే కాక దేశ ఆర్థిక వ్వయస్థకూ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రకటించనున్నారు. దీనికి తోడు మరికొన్ని కీలక పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
ఇతర కారణాలు..
బడ్జెట్తో పాటు US ఫెడ్ సమావేశం కూడా ఇన్వెస్టర్లకు చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. దీనికి ముందు ఆటో నంబర్లు, తయారీ అండ్ సేవల రంగం PMI మీద మార్కెట్ వర్గాలు దృష్టి సారిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ VP అజిత్ మిశ్రా వెల్లడించారు. ఇదే క్రమంలో లార్సెన్ & టూబ్రో, ACC, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ , ఐటీసీ, ఎస్బీఐ వంటి ప్రధాన సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సెన్సెక్స్, నిఫ్టీ పరిస్థితి..
గతవారం మార్కెట్ ప్రధాన సూచీలు చాలా క్షీణతను చూశాయి. అయితే రానున్న వారంలో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ వంటి కీలక సూచీలు బడ్జెట్ ప్రేరణతో ముందుకు సాగుతాయని బుల్స్ ఆశావహంగా ఉన్నట్లు స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తన అంచనాల్లో తెలిపారు.
అదానీ గ్రూప్..
ప్రస్తుతం మార్కెట్లో అందరూ అదానీ గ్రూప్ షేర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో మార్కెట్ అదానీ గ్రూప్ ను పర్యవేక్షిస్తుంది. FPO ధర కంటే మార్కెట్ ధర పతనాన్ని అందరూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు భారతీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు దాదాపుగా రూ.9,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం ముఖ్యమైన గమనించాల్సిన అంశంగా ఉంది.
కనిష్ఠానికి సూచీలు..
గతవారం చివరి రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వల్ల బెంచ్ మార్క్ సూచీలు కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ఇంధనం, మెటల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లోని కంపెనీల షేర్లు ఘోరంగా పతనమయ్యాయి.
ఇదే సమయంలో ఆటో, ఎఫ్ఎమ్సీజీ రంగాలు క్షీణతను తట్టుకోగలిగాయి. అయితే రానున్న వారంలో బడ్జెట్ ప్రసంగం రోజు రాత్రే ఫెడ్ మీటింగ్ రావటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుందని చెప్పుకోవాలి. ఈ రెండింటి కోసం ఇన్వెస్టర్లు చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నారు.